తుపాకీ కాల్పులతో రెచ్చిపోయిన ఎంఐఎం నేత

 ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తాటిగూడలో తుపాకీ కాల్పులు కలకలం‌ రేపాయి. ఎంఐఎం ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్‌ ఫారూఖ్‌ అహ్మద్‌ రివాల్వర్‌తో స్థానికులను బెంబేలెత్తించాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా పడ్డారు. 
 
ఫారూఖ్‌ రెండు రౌండ్లు కాల్పులు జరపగా ఒకరికి తల, మరొకరికి పొట్ట భాగంలో బులెట్లు దూసుకెళ్లాయి. క్షతగాత్రులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పాత కక్షల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలిసింది. 
 
తొలుత ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కాల్పులకు దారితీసినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఒక చేతిలో కత్తి, మరో చేతిలో తుపాకీతో ఫారూఖ్‌ వీర విహారం చేశాడు. కాల్పుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. 

ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫరూక్ అహ్మ ద్, టిఆర్‌ఎస్ నేత వసీం వర్గాల మధ్య కొంతకాలంగా రాజకీయ కక్షలు నెలకొన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది.

మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. పరస్పరం దాడులు చేసుకుంటున్న క్రమంలో ఎంఐఎం నేత తల్వార్‌తో దాడి చేస్తూ, మరో చేత్తో తుపాకీతో కాల్పులు జరిపాడు. అనుకోని ఘటనలో మన్నన్, మోతేషాన్, జమీర్ గాయపడగా క్షతగాత్రులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

గత మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం తరఫున ఫరూక్ భార్య బరిలో దిగగా… తెరాస తరఫున వసీం భార్య పోటీచేశారు. ఫరూక్ భార్య ఎన్నికల్లో గెలవగా వసీం వర్గం ఓటమిపాలైంది. అప్పటినుంచే ఇరువర్గాల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

కాగా, నిందితుడు ఫారూఖ్ అహ్మద్‌ను అదులోకి తీసుకుని విచారిస్తున్నామని ఐజి నాగిరెడ్డి తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని ఐజీ పేర్కొన్నారు. వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. 

ఫారూఖ్ లైసెన్స్‌డ్‌ గన్‌తో కాల్పులు జరిపారని వెల్లడించారు. క్రికెట్ గేమ్ ఆడుతున్న వారి పిల్లల గొడవ కాల్పులకు దారితీసినట్టుగా తెలుస్తోందని నాగిరెడ్డి చెప్పారు. ఫారూఖ్‌ నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఇంచార్జి ఎస్పీ సత్యనారాయణ తెలిపారు. గాడపడ్డవారికి ప్రాణాపాయం తప్పిందని చెప్పారు.