తెలంగాణకు రూ. 9,440 కోట్ల 396 కిమీ జాతీయ రహదారులు 

తెలంగానకు  396 కిలోమీటర్ల పొడవున రూ. 9,440 కోట్లు విలువైన 8 ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి తెలిపింది. వీటికి ఈ నెల 21వ తేదీన కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది. అదే రోజున 370 కిలోమీటర్ల విస్తీర్ణంలో రూ. 3,717 కోట్లు విలువైన ఆరు ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమం వర్చువల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా జరగనుంది. 

మొత్తం రూ. 13,157 కోట్లు విలువగల మొత్తం 14 ప్రాజెక్టులలో ఏడు ప్రాజెక్టులను జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అమలు చేస్తోంది, వీటిలో ఒకటి ప్రజలకు అంకితం చేసి, మిగిలిన ఆరు ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తారు. కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్రంలోని ఏడు ప్రాజెక్టులను ప్రజా పనుల విభాగం ద్వారా అమలు చేస్తోంది.

ఇందులో వీటిలో ఐదు ప్రాజెక్టులు ప్రజలకు అంకితం చేయనుండగా, మరో రెండు ప్రాజెక్టులకు భూమి పూజ జరుగనుంది. భారతదేశపు అతిపెద్ద మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమం అయిన భారత్ మాల పరియోజన కింద, దేశవ్యాప్తంగా 35,000 కిలోమీటర్ల జాతీయ రహదారులను కేంద్రం అభివృద్ధి చేస్తోంది. 

ఇందులో 1,400 కిలోమీటర్ల జాతీయ రహదారులను తెలంగాణ రాష్ట్రంలో భారత్‌మాల పరియోజన -భాగంగా ఒకటి కింద అభివృద్ధి చేస్తున్నారు. అదనంగా భారత్ మాల పరియోజన – II కింద 750 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వేలను కూడా అభివృద్ధి చేయనున్నారు.  దీంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల పొడవు 2014 మే నెలకి ముందు ఉన్న 2,511 కి.మీ నుండి ఇప్పుడు 3,910 కి.మీకి పెరిగనుంది. 1,399 కి.మీ మేర (55.71శాతం) నమోదైన ఇదే అత్యుత్తమ పెరుగుదలగా కేంద్రం అభివర్ణిస్తోంది.

ఎన్‌హెచ్  163 యాదగిరి, వరంగల్ కింద ఫోర్‌లేన్ రోడ్డు 99 కిలోమీటర్లును రూ. 1,890 కోట్లతో చేపట్టనున్నారు. అలాగే మన్నేగూడ,రావులపల్లి సెక్షన్ ఎన్‌హెచ్ 163 కింద టూ లేన్ రోడ్డు విస్తరణ పనులను రూ.359 కోట్లతో 73 కిలోమీటర్ల మేర చేపడతారు. ఎన్‌హెచ్ 163 కింద వరంగల్ జిల్లాలో టూ లేన్ రహదారి విస్తరణ పనులను రూ.230 కోట్లతో 35 కిలోమీటర్ల వరకు చేపడతారు.  

ఇక ఎన్‌హెచ్ 353 కింద వరంగల్ జిల్లాలో ప్రస్తుతమున్న క్యారేజ్‌వేను టూ లేన్ రహదారి పనులను రూ. 206 కోట్లతో 34 కిలోమీటర్ల మేర చేపడతారు. ఎన్‌హెచ్ 765 కింద మెదక్, మల్కాడ్‌గిరి జిల్లాల పరిధిలోని అవుటరింగ్ రోడ్డు అప్‌గ్రేడేషన్ పనులను రూ. 427 కోట్లతో 63 కిలోమీటర్లు, ఎన్‌హెచ్ 365 కింద సూర్యాపేట్, నల్గొండ జిల్లాలో నకిరికల్, తానమ్‌చెర్ల ప్రాంతాల్లో టూ లేన్ రోడ్డు విస్తరణ పనులను రూ.605 కోట్లతో, 67 కిలోమీటర్లు చేపడతారు.

భారత్‌మాల ప్రాజెక్టు కింద ఎన్‌హెచ్ 161, ప్యాకేజి..1 కింద కంది నుంచి రాంసాన్‌పల్లి వరకు రూ.1000కోట్లతో 40 కిలోమీటర్లు, ప్యాకేజి…2 కింద రాంసాన్‌పల్లి నుంచి మంగళూరు గ్రామం వరకు రూ.1,234 కోట్లతో 47 కిలోమీటర్లు, ప్యాకేజి…3 కింద తెలంగాణ, మహరాష్ట్ర బార్డర్ ప్రాంతమైన మంగళూరు స్ట్రెచ్‌ను రూ.936 కోట్లతో 49 కిలోమీటర్లు చేబడతారు. 

ఎన్‌హెచ్..363 కింద రేపల్లేవాడ నుంచి తెలంగాణ, మహరాష్ట్ర బార్డర్ రహదారిని రూ.1,140 కోట్లతో 53 కిలోమీటర్లు, ఎన్‌హెచ్..363 మంచిర్యాల్ ప్రాంతం, తెలంగాణ, మహరాష్ట్ర బార్డర్ రహదారిని రూ.1,357 కోట్లతో 42 కిలోమీటర్లు, ఎన్‌హెచ్..365 పరిధిలోని సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు రూ.1,566 కోట్లతో 59 కిలోమీటర్లు నిర్మిస్తారు. 

ఎన్‌హెచ్..161 పరిధిలో నిర్మల్ నుంచి ఖానాపూర్ సెక్షన్ వరకు టూ లేన్ రహదారి విస్తరణ పనులను రూ.142 కోట్లతో 22 కిలోమీటర్లు, ఎన్‌హెచ్..565 పరిధిలోని నకిరేకల్ నుంచి నాగార్జునసాగర్ సెక్షన్ వరకు రూ. 370 కోట్లతో 85 కిలోమీటర్ల మేర రహదారులను కేంద్రం అభివృద్ధి చేయనుంది.