భారత్‌‌ బంద్‌‌ లో టీఆర్ఎస్ నేతలకు చుక్కెదురు 

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్​తో మంగళవారం జరిగిన భారత్‌‌ బంద్‌‌ లో పాల్గొన్న టీఆర్ఎస్ నేతలకు చుక్కెదురైంది. టీఆర్ఎస్​ సర్కారు రాష్ట్రంలో సన్నవడ్లకు రేటు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా రైతులను బాధపెడుతోందని అంటూ ఆ పార్టీ నేతలకు బంద్​లో పాల్గొనే హక్కు లేదని ప్రతిపక్షాల నేతలతో పాటు సాధారణ ప్రజలు కూడా నిలదీశారు.
కలిసి ఆందోళనలో పాల్గొంటామని వచ్చిన అధికార పార్టీ నేతలను పలుచోట్ల అడ్డుకోవడం కనిపించింది. సన్నవడ్లకు రేటు పెంచాకే రైతుల తరఫున మాట్లాడాలని స్పష్టం చేశారు. దీంతో చాలాచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి చేసేది లేక టీఆర్ఎస్ నేతలు​ విడి​గానే ఆందోళనలు చేశారు. పలుచోట్ల మంత్రులు, టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలను కూడా ప్రతిపక్షాల నేతలు అడ్డుకొని నిరసన తెలిపారు.
కొన్నిచోట్ల బలవంతంగా షాపులు మూయించేసిన టీఆర్ఎస్​ నేతలపై వ్యాపారులు, జనం మండిపడ్డారు. రైతులు ఆందోళన చేస్తే అరెస్టులు చేస్తారు, టీఆర్ఎస్​వాళ్లు ధర్నా చేస్తే అరెస్టు చేయరా అంటూ జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్​లో రైతులు ధర్నా చేశారు.

బంద్​కు మద్దతుగా కరీంనగర్  బస్టాండ్  ఎదుట ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనలో పాల్గొనడానికి వచ్చిన  టీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలంతా ‘గో బ్యాక్ టీఆర్ఎస్..’ అంటూ నినాదాలు చేయడంతో.. అక్కడి నుంచి టీఆర్ఎస్​ నేతలు వెళ్లిపోయారు. 

పలుచోట్ల టీఆర్ఎస్​ నేతల  ఓవరాక్షన్​పై జనం మండిపడ్డారు. చొప్పదండి, జమ్మికుంటలో బలవంతంగా దుకాణాలు మూయించడాన్ని నిలదీశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో భారత్ బంద్ కు వ్యతిరేకంగా బీజేపీ నిరసన చేపట్టింది. టీఆర్ఎస్ నేతలు అక్కడికి రావడంతో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. అయితే అనుమహతి లేకుండా ఆందోళన చేపట్టారంటూ పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్​ చేశారు.

కరీంనగర్​ జిల్లా చొప్పదండిలో కాంగ్రెస్​ నేతలు  మంత్రి కొప్పుల ఈశ్వర్​ను అడ్డుకొని రైతు సమస్యలపై నిలదీశారు. రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేదని మంత్రిని నిలదీశారు. జగిత్యాల మండలం వెల్గటూర్​లోనూ ఆందోళనకారుల నుంచి మంత్రి కొప్పులకు నిరసన సెగ తగిలింది.

నిర్మల్​ జిల్లా భైంసా పట్టణం​లో టీఆర్‍ఎస్​ నేతలు  షాపులను బలవంతంగా మూసే ప్రయత్నం చేశారు. కొందరు వ్యాపారులు ఇందుకు ఒప్పుకోకపోవడంతో గొడవకు దిగారు. దీంతో టీఆర్‍ఎస్​ లీడర్ల తీరుపై వ్యాపారులు మండిపడ్డారు. బెదిరించి బంద్‍ చేయించడం సరికాదని ఆందోళనకు దిగారు.

కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని ఆమనగల్లులో టీఆర్ఎస్​ చేపట్టిన ఆందోళన రసాభాసగా మారింది. ఎమ్మెల్యే జైపాల్​యాదవ్ మంగళవారం ఉదయం కల్వకుర్తిలో బంద్​ను పర్యవేక్షించిన తర్వాత ఆమనగల్లు వెళ్లారు. అప్పటికే అక్కడ రాస్తారోకో మొదలుపెట్టిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గీయులు, జైపాల్​యాదవ్ రోడ్డుకు చెరోవైపు కూర్చున్నారు.

నారాయణరెడ్డి మాట్లాడుతుండగా వాగ్వాదం మొదలైంది. జైపాల్​ వర్గీయులు తమకు అడ్డుతగులుతున్నారంటూ ఎమ్మెల్సీ అనుచరులు నినాదాలు చేశారు. ఇరువర్గాలు పోటాపోటీ నినాదాలు చేసుకుంటూ తోపులాట దాకా వెళ్లారు. పోలీసులు కల్పించుకుని ఇరువర్గాలను వెనక్కి జరిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ముందే మండల స్థాయి నేతలు, కార్యకర్తలు తిట్టుకున్నారు.

టీఆర్ఎస్​ తీరును నిరసిస్తూ ఖమ్మం జిల్లా ముదిగొండలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్​ రెడ్డిని కాంగ్రెస్, సీపీఎం నేతలు ఘెరావ్​ చేశారు. పోలీసులు ఆందోళనకారులను పక్కకు తప్పించి ఎమ్మెల్యేను పంపేశారు. భారత్​ బంద్​తో ఏర్పడిన ట్రాఫిక్​ జామ్​తో ఓ గర్భిణీ ఇబ్బందులు పడింది. ట్రాఫిక్​ కదలకపోవడంతో దాదాపు కిలోమీటర్​ వరకు ఆమె ఇలా నడుచుకుంటూ వెళ్లింది. కరీంనగర్​ అల్గునూర్​ వద్ద జరిగిందీ ఘటన.

బంద్ సందర్భంగా యాదగిరిగుట్టలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బస్టాండ్​ పక్కన తెరిచి ఉంచిన ఓ షాపు యజమానితో టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్ష​ పార్టీల నేతలు వాగ్వాదానికి దిగారు. బంద్​ మొదలవడానికి ఉదయం11 గంటల దాకా​ టైం ఉంది కదా? అని షాపు యజమాని శివ నిలదీయడంతో  పార్టీల కార్యకర్తలు రెచ్చిపోయారు. 

షాపులోని వస్తువులను ధ్వంసం చేశారు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య బంద్ ఉంటుందని షాపు తెరిచానని,  కానీ పది గంటలలోపే వచ్చిన నేతలు  ఇష్టమొచ్చినట్టు తిడుతూ దాడి చేశారని శివ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల కళ్లెదుటే ఇదంతా జరిగినా ఏమీ పట్టించుకోలేదని ఆరోపించారు. తన షాపుపై దాడికి పాల్పడిన వారిపై పోలీస్​ లకు ఫిర్యాదు చేసాడు. 

బంద్​కు మద్దతుగా కామారెడ్డి సమీపంలో హైవేపై టీఆర్ఎస్​ నేతలు ధర్నా చేశారు. అయితే అక్టోబర్​లో రైతులు ఇక్కడే ఆందోళనకు దిగారు. సర్కారు మక్కలు కొనాలని, సన్నవడ్ల కు మద్దతు ధర ఇవ్వాలని ధర్నా చేశారు.  ఆ రోజు రైతులకు మద్దతు తెలపని టీఆర్ఎస్​ నేతలు ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని.. రైతులు ఆందోళన చేసినచోటిని ఆ పార్టీ​ నేతలు అపవి త్రం చేశారని బీజేపీ నేతలు మండిప డ్డారు. టీఆర్ఎస్​ ధర్నా పూర్తికాగానే హైవేను ఫినాయిల్​తో క్లీన్​ చేశారు.

రైతుల సమస్యలను ప్రభుత్వానికి తెలి పేందుకు తాము నిరసన చేస్తే పోలీసు లు అరెస్టులు చేశారని, మరి టీఆర్‌ ఎస్‌ నేతలను ఎందుకు వదిలేస్తున్నారని రైతు ఐక్యవేదిక నేతలు జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌లో ఆందోళనకు దిగారు. సన్నవడ్లకు మద్దతు ధర ఇవ్వాలని, మొక్కజొన్నను కొనాలని ఆందోళన చేపడితే  పోలీసులు అర్ధరాత్రి ఇండ్ల లోకి చొరబడి అరెస్ట్ చేశారని మండిపడ్డాయిరు.