జనవరి నుంచి టోల్ చెల్లింపులు నగదురహితం

జనవరి 2021నుంచి జాతీయ రహదారులపై జరిగే టోల్ చెల్లింపులను నగదురహితం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం  సిద్ధమైంది. జనవరి 1నుంచి టోల్ గేట్ల వద్ద 100 శాతం వసూళ్లను ఫాస్టాగ్ ద్వారా నిర్వహించేలా చర్యలకు ఉపక్రమించింది. 

ప్రస్తుతం టోల్ చెల్లింపుల్లో దాదాపు 75 శాతం ఫాస్టాగ్స్ ద్వారా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఒక లైన్‌లో మాత్రమే నగదు రూపంలో చెల్లింపులకు అనుమతి ఉంది. నూతన సంవత్సరం నుంచి వంద శాతం ఫాస్టాగ్ ఉండే అవకాశముంది. అంటే నగదు తీసుకునే అవకాశం లేదు.

కాబట్టి వాహనదారులు ముందే జాగ్రత్తపడటం మంచిది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) ప్రకారం స్మార్ట్ ట్యాగ్స్‌ను త్వరగా జారీ చేయడానికి, వాటిని రీఛార్జ్ చేయడానికి వీలుగా సిబ్బందిని నియమించుకుంటున్నారు. కొందరు నగదు రూపంలో చేసే చెల్లింపులు టోల్ ప్లాజాల వద్ద సాఫీగా జరిగే ప్రయాణంపై ప్రభావం చూపుతున్నాయని, ఈ నేపథ్యంలో నగదురహిత చెల్లింపుల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉందని చెబుతున్నారు.

ఫోర్ వీలర్స్, అంతకంటే పెద్ద వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ రెన్యూవల్ చేయాలన్నా, జనవరి 1వ తేదీ నుంచి, థర్డ్ పార్టీ బీమా రెన్యూవల్‌కు ఏప్రిల్ 1వ తేదీ నుండి ఫాస్టాగ్ తప్పనిసరి. ఈ మేరకు రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ నిబంధనలు తీసుకు వచ్చాయి. 

టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ నియంత్రించే లక్ష్యంతో కేంద్రం 2017లో ఫాస్టాగ్ విధానాన్ని తెచ్చింది. ఫాస్టాగ్ కలెక్షన్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. అక్టోబర్ నెలలో ఏకంగా రూ.702.86 కోట్ల డిజిటల్ టోల్ కలెక్షన్లు నమోదయ్యాయి. సెప్టెంబర్ నెలలో రూ.658.94 కోట్లుగా ఉంది. నవంబర్ కలెక్షన్లు అంతకు మించి ఉండే అవకాశం ఉంది. ఫాస్టాగ్ 100 శాతం తప్పనిసరి సమీపిస్తున్న నేపథ్యంలో డిజిటల్ టోల్ కూడాపెరుగుతున్నది.