ఢిల్లీలో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్టు

శౌర్య చక్ర విజేత బల్వీందర్‌ సింగ్‌ హత్య కేసులో నిందితులైన ఇద్దరితో సహా మొత్తం ఐదుగురు ఉగ్రవాదుల్ని తూర్పు ఢిల్లీలోని షాకర్‌పూర్‌ ప్రాంతంలో పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు పంజాబ్‌కు చెందిన వారు కాగా.. ముగ్గురు కశ్మీర్‌వాసులు. 
 
ఈ ఏడాది అక్టోబరులో బల్వీందర్‌ సింగ్‌ను కొంతమంది దుండగులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఆ కేసులో పంజాబ్‌ ఉగ్రవాదులిద్దరూ ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరిద్దరికీ కశ్మీర్‌ ఉగ్రవాదుల నుంచి నిధులు అందనున్నట్లు తమకు సమాచారం వచ్చిందని స్పెషల్‌ సెల్‌ డిప్యూటీ కమిషనర్‌ ప్రమోద్‌ సింగ్‌ కుశ్వాస్‌ వెల్లడించారు.
 
 ‘‘ఢిల్లీలోని లక్ష్మీనగర్‌లో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకునేందుకు యత్నించాం. స్వల్ప ఎన్‌కౌంటర్‌ అనంతరం అందరూ చిక్కారు’ అని ప్రమోద్‌ తెలిపారు.  వీరి వద్ద నుంచి ఆయుధాలు, ఇతర నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలాకొనడాన్ని అదునుగా ముష్కరులు దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు విపిపిస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఢిల్లీ పోలీసులకు, ఈ ఐదుగురు వ్యక్తులకు మధ్య ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది.