ఏపీలో రోడ్ల దుస్థితిపై రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసన  

ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడ చూసినా కనిపిస్తున్న గుంతల రోడ్లకు నిరసనగా రహదారులపై బిజెపి కార్యకర్తలు శనివారం గంటసేపు నిరసన ప్రదర్శనలు జరిపారు. వై ఎ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రహదారుల మరమ్మతులను విస్మరించిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. 
 
తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెం- అమలాపురం రహదారిపై బీజేపీ చేపట్టిన ఆందోళనకు ఆయన సారధ్యం వహిస్తూ  జగన్‌ ఇప్పుడు పాదయాత్ర చేస్తే రోడ్ల దుస్థితి తెలుస్తుందని ధ్వజమెత్తారు. సీఎం జగన్ స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్త పోరాటం చేస్తామని సోము వీర్రాజు హెచ్చరించారు.  
 
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 18నెలలుగా ఏ ఒక్క రహదారి నిర్మాణం చేయలేదని రాష్ట్రంలో పలు ప్రాంతాలలో పాల్గొన్న నిరసన ప్రదర్శనలలో బిజెపి నేతలు విరుచుకు పడ్డారు. కనీసం గుంతలు కూడా పూడ్చకుండా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గాలిలో గెలిచిన పార్టీ, ఆ గాలిలోనే హెలికాప్టర్‌లోనే జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నారని విమర్శించారు. 
 
కేంద్రం పంచాయతీ రాజ్‌కు నిధులు ఇస్తే.. వాటిని ఇతర అవసరాలకు మళ్లించారని బిజెపి నేతలు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనను పూర్తిగా గాలికి వదిలేశారని దుయ్యబట్టారు.  ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యలపై ప్రాధాన్యత లేదని, ఒక చేత్తో డబ్బులు తీసుకుని, మరో చేత్తో తాయిలాలు ఇచ్చి గెలవాలని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. 
 
ఆరు‌వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూములు కొనుగోలు చేశారని, కమిషన్‌లు మాత్రం దోచుకున్నారని ఆరోపించారు. పట్టాలు మాత్రం పంచడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో రహదారులపై పడవలలో వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు. ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం కేంద్రం వేసిన జాతీయ రహదారులపై  తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
వైసీపీ నేతల ఆస్తులు పెరిగిపోతున్నాయని, ప్రజల ఆస్తులు తరిగిపోతున్నాయని దయ్యబట్టారు. బిల్లులు చెల్లించక పోవడంతో కాంట్రాక్టర్‌లు కూడా ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఓట్లు, సీట్లు తప్ప మరో ఆలోచన లేదని విమర్శించారు. 18నెలల పాలనలో ఎన్ని రహదారులు వేసారో, ఎన్ని పనులు చేశారో  అనే అంశం పై శ్వేత పత్రం విడుదల చేయాలని  డిమాండ్ చేశారు.
 
గుంతలమయంగా ఏర్పడిన రహదారులు వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి లోనై, తరుచూ ప్రమాదాల బారిన పడుతున్నారని బిజెపి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.  గుంతలను పూడ్చి, పాడైన రోడ్డును యుద్ధప్రాతిపదికన నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు.