కేంద్రంలో మా ప్రభుత్వం … డీజీపీకి సంజయ్ హెచ్చరిక 

‘డీజీపీ గారు.. మా కార్యకర్తలను ఎంత మందిని కొట్టించారో లెక్క రాసుకుంటున్నం. ఆ లెక్కలను త్వరలోనే మీకు అప్పజెప్పుతం’ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.  కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీనేనని మరిచిపోవద్దని  హితవు చెప్పారు.
‘సీఎం కేసీఆర్ డైరెక్షన్‌‌లో పోలీసులు, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌‌ఈసీ) అధికారులు పని చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో పని చేయండి. లేదంటే ప్రజలే తిరగబడ్తరు’ అని కూడా సంజయ్‌‌ హెచ్చరించారు.

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నగరంలోని పలు డివిజన్లలో టీఆర్ఎస్ నేతలు జరిపిన దాడిలో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను వాళ్ల ఇండ్లకు వెళ్లి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ  ‘బీజేపీ కార్యకర్తలను పోలీసుల ముందే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు కొట్టినా కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అట్లే చూస్తూ ఉండిపోయారు’ అని ఆరోపించారు.

‘డీజీపీ, ఎన్నికల కమిషనర్ గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి. మీరు నిష్పక్షపాతంగా పని చేస్తున్నారా?’ అని నిలదీశారు. సామాన్య జనం పోలీస్‌‌ స్టేషన్‌‌కు వెళ్తే న్యాయం జరుగుతుందనే  నమ్మకం లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. మంత్రులు, ఎమ్మెల్యేల పైరవీలతో పోలీసులు పోస్టింగ్‌‌లు పొంది ఉద్యోగాలు చేస్తే పరిస్థితి ఇలానే ఉంటుందని విమర్శించారు.

ఎస్‌‌ఈసీ స్వతంత్రంగా పని చేయాలని, కానీ కేసీఆర్ సర్కారులో ఆ పరిస్థితి లేదని సంజయ్‌‌ దయ్యబట్టారు. ఎస్‌‌ఈసీకి సీపీఐ, సీపీఎం గుర్తులు కూడా తెలియని పరిస్థితి ఉందంటే కమిషన్‌‌ పనితీరు ఎట్లుందో అ ర్థమవుతోందని ఎద్దేవా చేశారు. ఓటు హక్కు కూడా లేని ఓ విద్యార్థికి ఓ  పోలింగ్ బూత్‌‌లో ఎన్నికల డ్యూటీ అప్పగించడం కంటే దారుణం ఉంటుందా అని ప్రశ్నించారు. 

వెంగళరావునగర్‌‌లో మల్లేశ్వర్‌‌రావు అనే బీజేపీ కార్యకర్త కాషాయం అంగి వేసుకున్నాడని పోలింగ్ బూత్ దగ్గర టాస్క్ ఫోర్స్ పోలీసులు కొట్టారని సంజయ్ మండిపడ్డారు. కాషాయం అంటేనే సీఎంకు భయం పట్టుకుందని దయ్యబట్టారు. 

‘కేసీఆర్ పచ్చ చొక్కా వేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. సీఎం తినే అన్నంలోనూ పచ్చ రంగు కలుపుకున్నా ఇబ్బంది లే దు. కానీ కాషాయ జెండా జోలికొస్తే ఊరుకోం’ అని హెచ్చరించారు. సీఎం గడీల పాలన చేస్తున్నారని పేర్కొంటూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కాపాడాలంటే బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు.