2021 రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరుకానున్నారు. నవంబర్ 27న జాన్సన్తో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన ఫోన్ సంభాషణల్లో ఆయన్ను రిపబ్లిక్ డే ముఖ్య అతిధిగా హాజరుకావాలని కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు.
అదే సమయంలో బ్రిటన్లో జరిగే జీ7 సదస్సుకు హాజరుకావాలని జాన్సన్ ప్రధాని మోదీని కోరారు. రాబోయే పదేళ్లలో రెండు దేశాలూ అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఇద్దరు ప్రధానులు చర్చించారని సమాచారం.
కోవిడ్పై పోరుతో సహా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, వాతావరణ మార్పుల అంశాలపై లోతుగా చర్చించినట్లు తెలిసింది. భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు జాన్సన్ సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
బ్రెగ్జిట్ అనంతర పరిణామాల్లో బ్రిటన్కు భారత్తో పాటు ప్రపంచ దేశాల సహకారం ఎంతో అవసరం. ఈ తరుణంలో భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొల్పాలని బ్రిటన్ ప్రధాని బలంగా కోరుకుంటున్నారు.
1993లో బ్రిటన్ ప్రధాని జాన్ మేయర్ భారత గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వాస్తవానికి 2021 గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా అమెరికా కొత్త అధ్యక్షుడు బైడెన్ను ఆహ్వానించాలని యోచించినా ఆయన పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టేందుకు మరింత సమయం పట్టనుండటంతో జాన్సన్ను ఆహ్వానించినట్లు సమాచారం.
More Stories
కేజ్రీవాల్ జైలులో సీఎంగా కొనసాగడంపై హైకోర్టు అసహనం
రెండో దశలో 64.2 శాతం పోలింగ్
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ