కేసీఆర్ కరోనా కంటే డేంజర్  

కేసీఆర్ కరోనా కంటే డేంజర్ అని ప్రముఖ నటి, మాజీ ఎంపీ విజయశాంతి హెచ్చరించారు.  జీహెచ్ఎంసీ  ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరు చాలా విడ్డూరంగా ఉందని ఆమె పేర్కొన్నారు. 

ఒక బక్క జీవి అయిన కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమంది కేంద్రమంత్రులు రావాలా? అని సీఎం ప్రశ్నించారు. కేసీఆర్ మాటలు వింటుంటే… ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ కూడా, కంటికి కనిపించని చిన్న సూక్ష్మజీవినైన నన్ను నివారించడానికి ప్రపంచంలోని ఇన్ని దేశాలు కలిసి పోరాడటం సమంజసమేనా? అని అడిగితే ఎలా ఉంటుందో…అలా ఉందని ఆమె ఎద్దేవా చేశారు. 

ఒక దుష్టశక్తిని తుదముట్టించడానికి మంచి శక్తులన్నీ కలసి ఎంతో పోరాటం చేస్తేనే ఫలితం వస్తుందని చరిత్ర చెబుతోందని ఆమె గుర్తు చేశారు.  జీహెచ్ఎంసీ   మేయర్ పదవిని ఇతర పార్టీలకు కట్టబెడితే భూమి తలకిందులైపోతుందని, అభివృద్ధి ఆగిపోతుందని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, మతకల్లోలాలు జరిగిపోతాయని కేసీఆర్ అరిచి గీపెడుతున్నారని ఆమె ఆరోపించారు. 

సీఎం దొరగారు ఏ పార్టీలను ఉద్దేశించి ఇలా అన్నారో గానీ, ఆయన మాటలే గనుక నిజమైతే… దేశంలోని అనేక రాష్ట్రాల్లో వరుసగా పలుమార్లు ఇప్పుడున్న జాతీయ పార్టీలు విజయాలు సాధించాయని.. మరి అక్కడ అభివృద్ధి జరగడం కారణంగానే తిరిగి ప్రజలు ఆ పార్టీలకు పట్టం కడుతున్నారని ఆమె తెలిపారు. 

కేసీఆర్ కుటుంబం చెబుతున్న విధంగా అరాచక పాలన జరిగితే దేశంలోని ఆ రాష్ట్రాల్లో ఆ పార్టీలకు తిరిగి తిరిగి అధికారం ఎలా దక్కుతుందని విజయశాంతి ప్రశ్నించారు.