వీధి వ్యాపారుల పట్ల బల్దియా నిర్లక్ష్యం

వీధి వ్యాపారులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి పథకాన్ని ప్రారంభించింది. కానీ బల్దియా అధికారుల నిర్లక్ష్యం కారణంగా గ్రేటర్ హైదరాబాద్ లో వీధి వ్యాపారులకు ఈ పధకం క్రింద రుణాలు అందడం 
లేదు.
 
పీఎం స్వనిధి పథకంలో భాగంగా వీధి వ్యాపారుల‌కు 7 శాతం వ‌డ్డీతో రూ. 10 వేల వరకు రుణం మంజూరు చేస్తారు. ల‌బ్ధిదారులు ఈ రుణాన్ని 12 నెల‌ల పాటు స‌మాన వాయిదాల‌లో చెల్లించాలి. 7 శాతం కంటే  అదనంగా చెల్లించిన వ‌డ్డీ  తిరిగి వారి ఖాతాల్లో జ‌మ చేస్తారు. 
 
అదేవిధంగా డిజిట‌ల్ లావాదేవీల ద్వారా చెల్లింపులు చేసిన వీధి వ్యాపారుల‌కు నెల‌వారీ వాయిదాలో రూ. 100 ప్రోత్సాహ‌క మిన‌హాయింపు ల‌భిస్తుంది. హైదరాబాద్లో 2 లక్షలకు పైగా వీధివ్యాపారులు ఉన్నట్లు చెబుతున్నప్పటికీ అధికారులు వారిని గుర్తించి లైసెన్స్లు అందజేయడంలో నిర్లక్ష్యం  వహిస్తున్నారు.
 
ఇప్పటివరకు దాదాపు లక్ష మందిని గుర్తించగా వారిలో కేవలం 15 వేల మంది ఖాతాలో మాత్రమే నగదు పడింది. 20 ఏళ్ల నుంచి వీధివ్యాపారం చేస్తున్న వారికి కూడా రుణం అందలేదు. ఇదే అంశంపై ఈ ఏడాది ఆగస్టులో సీఎస్ సోమేష్ కుమార్స్వయంగా పలు ప్రాంతాల్లో పర్యటించి వీధి వ్యాపారులతో మాట్లాడారు. 
 
అప్పట్లో బల్దియా అధికారులు హడావిడి చేసి కొందరికి రుణాలు అందించారు. మరికొందరి నుంచి దరఖాస్తులు తీసుకున్నా రుణాలు మాత్రం అందలేదు. వీధి వ్యాపారుల స‌ర్వే, గుర్తింపు కార్డుల జారీ, రుణ మంజూరు ప్రక్రియ కొన‌సాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. 
 
మరోవంక, రుణాల మంజూరీలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. చాలా డివిజన్లలో రుణం ఇప్పిస్తామంటూ రూ.200 నుంచి రూ.500 వరకు వసూలు చేశారు.   పలు డివిజన్లలో ఇలా ముందుగా డబ్బులు వసూలు చేసినా రుణాలు మాత్రం అందకపోవడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు.