అబోట్టాబాద్ గుర్తు పెట్టుకో .. .పాక్‌కు భారత్ హెచ్చరిక

భారత్‌లో ఉగ్రదాడులకు ఉప్పందిస్తూ  భారత్‌పైనే తప్పుడు ప్రచారం చేస్తున్న పాకిస్తాన్‌కు ‘అబోట్టాబాద్ గుర్తు పెట్టుకో’ అంటూ భారత్ గట్టి హెచ్చరిక చేసింది. ఐక్యరాజ్య సమితి నిషేధించిన ఎంతో మంది ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయమిస్తోందని, అలాంటి పాక్‌ను ఎవరూ నమ్మబోరని భారత్ స్పష్టం చేసింది. 

భారత్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్‌ను కలిసిన పాకిస్తాన్ రాయబారి మునీర్ అక్రమ్ ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ అండతో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కశ్మీర్ సహా భారత్‌లోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న దాడులను కీలక దేశాల రాయబారులకు భారత్ వివరించిన మరుసటి రోజు పాక్, ఐరాసాను సంప్రదించింది.

దీనిపై ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి  టీఎస్ తిరుమూర్తి, తన ట్విట్టర్ ఖాతా ద్వారా పాక్‌ను ఎండగట్టారు. ‘‘పాక్ పదే పదే వల్లె వేస్తున్న అబద్ధాలకు ఎలాంటి విశ్వసనీయతా దక్కదు. తప్పుడు పత్రాలను రూపొందించి, తప్పుడు కథనాలను వ్యాపింపడజేయడం పాకిస్తాన్‌కు కొత్త కాదు” అంటూ ధ్వజమెత్తారు. 

ఐక్య రాజ్య‌స‌మితి నిషేధానికి గురైన ఉగ్ర‌వాదులు, సంస్థ‌ల‌కు పాకిస్థాన్ అడ్డా అని, అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ హ‌త‌మైన అబోటాబాద్ గుర్తు లేదా అని ఆయ‌న ట్వీట్ చేశారు. పాకిస్థాన్ ఇచ్చిన ఈ అబ‌ద్ధాల నివేదిక‌కు అస‌లు ఏమాత్రం విశ్వ‌స‌నీయ‌త లేద‌ని దుయ్యబట్టారు. ఇలాంటి త‌ప్పుడు  ఆరోప‌ణ‌లు, బూట‌క‌పు నివేదిక‌లు పాకిస్థాన్‌కు కొత్త కాద‌ని తిరుమూర్తి ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు

“ఐరాస నిషేధించిన ఉగ్రవాదుల్లో అత్యధిక మంది పాకిస్తాన్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు. అబోట్టాబాద్ గుర్తు పెట్టుకుంటే మంచింది’’ అని తిరుమూర్తి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో పీఎంవో, భారత విదేశాంగ శాఖ, విదేశాంగ మంత్రి జయశంకర్‌లను ట్యాగ్ చేశారు.

అమెరికా 9/11 ఉగ్రదాడి సూత్రదారి బిన్ లాడెన్ పాకిస్తాన్‌లోని అబోట్టాబాద్‌లో దాక్కున్నాడని సమాచారం అందుకున్న అమెరికా  2011 మే నెలలో ప్రత్యేక కమాండో ఆపరేషన్ ద్వారా హతమార్చి విషయం తెలిసిందే. రుమూర్తి చెప్పినట్లు ఇప్పటికీ అనేక మంది అంతర్జాతీయ ఉగ్రవాదులు పాకిస్తాన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్నారు. పాక్ తన చర్యలను మానుకోకుంటే అబోట్టాబాద్ లాంటి ఘటనలు తప్పవని ఆయన హెచ్చరించారు.