టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లికి చుక్కెదురు 

నోరోడ్స్‌ .. నో ఓట్స్‌ ప్లకార్డులను చూపుతూ యాప్రల్‌ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారానికి వచ్చిన టిఆర్‌ఎస్‌కు చెందిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే హనుమంతరావును యాప్రల్‌ ప్రజలు నిలదీశారు. అనంతరం 2కి.మీ వరకు స్థానికులు నిరసన ర్యాలీ నిర్వహించారు.

స్థానికుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన సెగ తగలడంతో ఎన్నికలు అయిపోగానే సొంత నిధులతో రోడ్లు వేయిస్తానంటూ తన లెటర్ ప్యాడ్‌పై సంతకం చేసి మరీ ఎమ్మెల్యే మైనంపల్లి వారికి హామీ ఇచ్చారు. అంతేకాకుండా తలపై చేయివేసుకుని ప్రమాణం కూడా చేశారు. 

దీంతో ఓటర్లు శాంతించారు. సొంత నిధులు అవసరం లేదని, జీహెచ్ఎంసీకి తాము ట్యాక్స్‌లు కడుతున్నామని, ప్రజాధనంతోనే తమకు రోడ్లు వేయాలని ఓటర్లు డిమాండ్ చేశారు. తనను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు తప్పకుండా న్యాయం చేస్తానని మైనంపల్లి హనుమంత రావు హామీ ఇచ్చారు.