కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తుండటంతో మధ్యప్రదేశ్, గుజరాత్లో రాష్ట్రాలు రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించాలని నిర్ణయించాయి. మధ్యప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో నవంబర్ 21 నుంచి కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ తెలిపారు.
ఇండోర్, భోపాల్, గ్వాలియర్, విదిశ, రత్లామ్ జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించనున్నట్లు వెల్లడించారు. అయితే అత్యవసర సేవలు అవసరమైన వారికి, ఫ్యాక్టరీల్లో విధులు నిర్వహించే కార్మికులకు మాత్రం ఈ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని శివరాజ్ చెప్పారు.
ఇక, గుజరాత్లోనూ కరోనా కట్టడి కోసం రాత్రివేళల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ వెల్లడించారు. నవంబర్ 21 నుంచి రాజ్కోట్, సూరత్, వడోదర పట్టణాల్లో కర్ఫ్యూ విధించనున్నట్లు ఆయన తెలిపారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని చెప్పారు. అదేవిధంగా అహ్మదాబాద్లో నవంబర్ 20 రాత్రి 9 గంటల నుంచి నవంబర్ 23 ఉదయం 6 గంటలకు సంపూర్ణంగా కర్ఫ్యూను అమల్లోకి తెచ్చినట్లు నితిన్ పటేల్ వెల్లడించారు.
ఇలా ఉండగా, దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ- ముంబై నగరాల మధ్య విమాన, రైలు సర్వీసులను నిలిపివేయాలని మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే సర్కారు యోచిస్తోంది. కరోనా వైరస్ ఢిల్లీ నుంచి ముంబైనగరానికి వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్తగా ఈ చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర సర్కారు యోచిస్తోంది.
More Stories
వన్డేలు, టీ20లో అగ్రస్థానంలో టీమ్ఇండియా
సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరిస్తే చర్యలు
సప్తపదితో ముడిపడినదే హిందూ వివాహం