కరోనా వాలంటీర్ గా హర్యానా ఆరోగ్య మంత్రి 

కరోనాను నివారించేందుకు భారత్‌లోని ప్రముఖ ఫార్మా సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తోన్న కోవాగ్జిన్‌ మూడవ దశ ప్రయోగాలు ఈ నెల 20 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ ప్రయోగాల్లో భాగంగా హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్‌ విజ్‌ వాలంటీర్‌గా ఉండేందుకు ముందుకు వచ్చారు. 

తాను స్వచ్ఛందంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. ఇప్పటికే కోవాగ్జిన్‌ రెండు దశల ట్రయల్స్‌ను పూర్తి చేశారు. దీంతో మూడవ దశకు డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డిసిజిఐ) అనుమతులు ఇచ్చింది. 

ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 25 కేంద్రాల్లో 26 వేల మంది వాలంటీర్లతో మూడవ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడానికి భారత్‌ బయోటెక్‌ సన్నాహాలు చేపట్టింది. ఈ నెల 20 నుండి ఈ ప్రయోగాలు ప్రారంభం కానున్నాయి. 

ఐసిఎంఆర్‌ భాగస్వామ్యంతో ఈ ప్రయోగాలు చేపట్టనుంది. కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ కోసం భారత్‌లో చేపడుతున్న అతిపెద్ద క్లినికల్‌ ట్రయల్‌ ఇదే. ట్రయల్స్‌లో భాగంగా వాలంటీర్లకు 28 రోజుల తేడాతో రెండు ఇంట్రామస్కులర్‌ ఇంజెక్షన్లు ఇస్తారు. 

తొలి రెండు దశల్లో ఇప్పటి వరకు టీకా తీసుకున్న వాలంటీర్లలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని భారత్‌ బయోటెక్‌ ఇప్పటికే ప్రకటించింది.