కరొనకు భారత్‌ బయోటెక్  చుక్కల మందు   

కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు అందరూ సులభంగా వేసుకునేలా ముక్కులో వేసుకునే చుక్కుల మందును తయారు చేస్తున్నామని భారత్‌ బయోటెక్‌ ఎండి కృష్ణా ఎల్లా తెలిపారు. 
 
హైదరాబాద్‌లోని ఐఎస్‌బి నిర్వహించిన వెబినార్‌లో పాల్గన్న కృష్ణా ఎల్లా మాట్లాడుతూ ఇప్పటికే కరోనా నివారణకు తాము తయారు చేసిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ మూడో విడత మానవ పరీక్షలకు వెళ్లిందని చెప్పారు. 
 
అయితే ఈ వ్యాక్సిన్‌ను రెండు దఫాలుగా వేయాలని, భారత దేశ ప్రజలందరికీ వేయాలంటే 260 కోట్ల సిరంజీలు, సూదులు అవసరమౌతాయని చెప్పారు. అందువల్లే తాను సంతోషంగా లేనని, దీనికి పరిష్కారం కోసమే ముక్కులు వేసుకునే చుక్కల వ్యాక్సిన్ను తయారు చేస్తున్నామని, వచ్చే ఏడాదికి ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
 
కరోనా వైరస్‌ ప్రమాదకరంగా మారుతుందని తాము ముందే ఊహించి తమ కంపెనీలో బిఎస్‌ఎల్‌ 3 ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఇటువంటి ఉత్పత్తి కేంద్రం ప్రపంచంలో మరెక్కడా లేదని చెప్పారు. ఇప్పుడే చైనాలో 250 మిలియన్‌ డాలర్లలో ఏర్పాటు చేస్తున్నారని, అమెరికా, యూరప్‌లో ఎక్కడా బిఎస్‌ఎల్‌ 3 ఉత్పత్తి కేంద్రం లేదని కృష్ణా ఎల్లా తెలిపారు.