కేరళ గవర్నర్‌కు కరోనా పాజిటివ్

కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్‌ కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు. 

‘‘నాకు కరోనా సంక్రమించింది. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. అయితే, ఆందోళన చెందాల్సిందేమీ లేదు. గత వారం ఢిల్లీలో నన్ను కలిసిన ప్రతి ఒక్కరు కరోనా పరీక్షలు తప్పక చేయించుకోండి. లేదంటే అబ్జర్వేషన్‌లో ఉండండి’’ అని ట్వీట్ చేశారు.

కేరళలలో ఇప్పటి వరకు 4,62,469 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 83,208 మంది చికిత్స పొందుతున్నారు. శుక్రవారం 27 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,640కి చేరుకుంది. 7,854 మంది కోలుకోవడంతో మొత్తంగా రికవరీ అయిన వారి సంఖ్య 3,88,504కు పెరిగింది.

ఇలా ఉండగా, భారత్ లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో 50,357 కొత్త కోవిడ్-19 కేసులు, 577 మరణాలు సంభవించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 84,62,081కు పెరిగాయి. ఈ మహమ్మారి బారినపడి 1,25,562 మంది మృతి చెందారు.

భారత్ లో ప్రస్తుతం 5,16,632 కరోనా యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకు 78,19,887 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు 92.41శాతం ఉండగా, మరణాలు రేటు 1.48 శాతం ఉంది.

 నవంబర్ 6 వరకు మొత్తం 11,65,42,304 మంది బాధితుల నమూనాలను పరీక్షించగా వీటిలో శుక్రవారం 11,13,209 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకటించింది.