కేరళ మంత్రి జలీల్‌కు కస్టమ్స్ శాఖ సమన్లు

హోలీ ఖురాన్ కన్‌సైన్‌మెంట్స్‌ను ఆమోదించి, నిబంధనలను ఉల్లంఘించిన కేసులో కేరళ ఉన్నత విద్యా శాఖ మంత్రి కేటీ జలీల్‌‌కు కస్టమ్స్ శాఖ సమన్లు జారీ చేసింది. 

వ్యక్తిగతంగా ఉపయోగించుకునేందుకు యూఏఈ కాన్సులేట్ అధికారులు దౌత్య మార్గంలో ఈ కన్‌సైన్‌మెంట్‌ను తెప్పించుకోగా, జలీల్ ఆమోదించినట్లు పేర్కొంది. సోమవారం కస్టమ్స్ కార్యాలయానికి వచ్చి, సంబంధిత అధికారుల సమక్షంలో హాజరుకావాలని ఆదేశించింది.

ఖురాన్ దిగుమతితోపాటు దర్యాప్తులో ఉన్న మరికొన్ని అంశాలపై జలీల్‌ను కస్టమ్స్ అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఇప్పటికే ఎన్ఐఏ జలీల్‌ను ప్రశ్నించింది. 

హోలీ ఖురాన్ కన్‌సైన్‌మెంట్స్‌ను ఆమోదించి, నిబంధనలను ఉల్లంఘించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఆయనను ప్రశ్నించింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై దర్యాప్తు జరిపింది. 

యూఏఈ కాన్సులేట్ అధికారులు తమ వ్యక్తిగత వినియోగం కోసం హోలీ ఖురాన్ కన్‌సైన్‌మెంట్స్‌ను స్వీకరించడం, వేలాది కేజీల ఖర్జూరాన్ని దిగుమతి చేసుకోవడంపై వేర్వేరుగా కేసులను కస్టమ్స్ శాఖ నమోదు చేసింది. 

2017లో దాదాపు 18 వేల కేజీల ఖర్జూరాన్ని యూఏఈ కాన్సులేట్ అధికారులు దిగుమతి చేసుకోగా, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింద కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈ కేసుల్లో చట్టాలను ఉల్లంఘించినిన ‘శక్తిమంతుల’పై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.