చైనా పటాకుల విక్రయంపై ఎంపీ నిషేధం

దీపావళి పండుగకు ముందు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చైనా పటాకుల విక్రయం, వినియోగాన్ని నిషేధిస్తూ మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైనా దేశ పటాకులు నిల్వ, రవాణా, విక్రయాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
 
నిషేధిత చైనా పటాకులను ఎవరైనా విక్రయిస్తే వారిపై పేలుడు పదార్థాల చట్టం కింద చర్యలు తీసుకోవాలని సీఎం చౌహాన్ హోంశాఖ అధికారులు, డీజీపీని ఆదేశించారు.  పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్ 9-బి (1) (బి) ప్రకారం అక్రమ పటాకుల నిల్వ, పంపిణీ, అమ్మకం, వాడకంపై రెండేళ్ల శిక్ష విధించే నిబంధన ఉందని  హోం శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ రాజేష్ రాజౌరా చెప్పారు.
 
చైనా దేశం నుంచి పటాకులను దిగుమతి చేసుకోవడం చట్టవిరుద్ధమని, దీన్ని నిషేధించామని రాజేష్ పేర్కొన్నారు.మధ్యప్రదేశ్ రాష్ట్ర కుమ్మరులకు ఉపాధి కల్పించేలా మట్టి దీపాలు, స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సీఎం చౌహాన్ విజ్ఞప్తి చేశారు.