దీర్ఘకాలిక లాభాలకు భారత్ లో పెట్టుబడులు పెట్టండి 

దీర్ఘకాలిక లాభాలు  భారత్ లో ఇతోధికంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అంతర్జాతీయ పెట్టుబడి దారులకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. గురువారం వర్చువల్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ రౌండ్‌టేబుల్‌-2020 (వీజీఐఆర్‌-2020) సమావేశంలో ప్ర‌ధాని పాల్గొంటూ  ప్రపంచంలో అతితక్కువ కార్పొరేట్‌ పన్ను రేట్లున్న దేశాల్లో భారత్‌ ఒకటని గుర్తుచేశారు. 

‘మీరు విశ్వసనీయతతో రాబడులను.. ప్రజాస్వామ్యంతో డిమాండ్‌ను, స్థిరత్వాన్ని.. సానుకూలమైన వృద్ధిని కాంక్షిస్తే  అందుకు భారత్‌ తగిన స్థానం’ అని చెప్పారు. ఉత్తమ ప్రజాస్వామ్యతో పాటు జనాభాను, డిమాండ్‌ను, వైవిధ్యాన్ని భారత్‌ అందిస్తున్నదని పేర్కొన్నారు. ఒకే మార్కెట్లో మీరు బహుళ మార్కెట్లను పొందడమే భారత్‌ అందిస్తున్న వైవిధ్యం అని తెలిపారు. 

భారత్‌ సాధిస్తున్న విజయాలు ప్రపంచ అభివృద్ధి, సంక్షేమంపై ఎన్నో రెట్ల ప్రభావాన్ని చూపుతాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కొవిడ్‌-19 మహమ్మారితో పోరాడటం, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడంలో భారత్‌ గొప్ప పనితీరును కనబర్చిందని గుర్తు చేశారు. భారత్‌ అనుసరిస్తున్న విధానాలతోపాటు ఇక్కడి వ్యవస్థల బలం, ప్రజల మద్దతుతోనే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. 

ఆత్మనిర్భర్‌ భారత్‌ అనేది కేవలం విజన్‌ మాత్రమే కాదని, ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యూహమని మోదీ తెలిపారు. ‘భారత్‌ను ప్రపంచ ఉత్పాదక శక్తి కేంద్రంగా మార్చేందుకు, మా వ్యాపారాల సామర్థ్యాలను, కార్మికుల నైపుణ్యాలను ఉపయోగించడమే లక్ష్యంగా పెట్టుకున్న వ్యూహమే ఆత్మనిర్భర్‌ భారత్‌’ అని స్పష్టం చేశారు. 

ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడిదారులైన సావరిన్‌ వెల్త్‌ ఫండ్స్‌, పెన్షన్‌ ఫండ్స్‌ సహా అమెరికా, ఐరోపా, కెనడా, కొరియా, జపాన్‌, పశ్చిమాసియా, ఆస్ట్రేలియా, సింగపూర్‌ తదితర దేశాలకు చెందిన అగ్రశ్రేణి సంస్థాగత పెట్టుబడిదారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సంస్థల ఆధీనంలో దాదాపు 6 ట్రిలియన్‌ డాలర్ల ఆస్తులున్నాయి. 

భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని 5 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చడం, దేశం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, సంస్కరణలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకున్న అవకాశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కేంద్ర ఆర్థిక శాఖ, నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ ఈ సమావేశాన్ని నిర్వహించాయి.