ప్రత్యక్ష ప్రసారంపై హైకోర్టు విముఖత 

 
పాలనా వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ రద్దు చట్టాలతోపాటు రాజధాని అమరావతికి సంబంధించిన వ్యాజ్యాల్లో జరగబోయే తుది విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలనే ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే తరహా వ్యాజ్యాలను పలు హైకోర్టులు తోసిపుచ్చాయని గుర్తు చేసింది. 
 
ఈ నేపథ్యంలో తాము కూడా ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌, జస్టిస్‌ ఉమాదేవితో కూడిన డివిజన్‌ బెంచ్‌ వివరించింది. ఇలాంటి అభ్యర్థనను పలు హైకోర్టులు ఇప్పటికే తిరస్కరించాయని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ తరపు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ డివిజన్‌ బెంచ్‌ దృష్టికి తెచ్చారు. 
 
వాటిలో వివిధ హైకోర్టుల తీర్పుల ప్రతులను తమకు అందజేయాలని ఆయనను హైకోర్టు ఆదేశించింది. సదరు కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేలా హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను ఆదేశించాలని విజయవాడకు చెందిన ఎల్‌ఎల్‌ఎం విద్యార్థి వేమూరు లీలాకృష్ణ దాఖలు చేసిన పిల్‌పై తదుపరి విచారణను ఈ నెల 17కు హైకోర్టు వాయిదా వేసింది.