ధరణి పోర్టల్ దేశానికే ట్రెండ్ సెట్టర్

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ భార‌త‌దేశానికి ట్రెండ్ సెట్ట‌ర్ అని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి పోర్ట‌ల్‌ను మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా  మూడు చింతలపల్లి గ్రామంలో ప్రారంభించారు. 

ఒకప్పుడు భూమి కేవలం ఉత్పత్తి సాధనంగా మాత్రమే ఉందని, ఒకప్పుడు భూమికి ప్రాధ్యాన్యత ఉండేది కాదని, నిర్ణీత పద్ధతిలో వ్యవసాయం చేసిన తరువాత భూమికి విలువ పెరిగిందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. గ‌త పాల‌కులు రెవెన్యూ చ‌ట్టాలు, భూ విధానాల‌కు శ్రీకారం చుట్టారని, వాటిల్లో కొన్ని ఫ‌లితాలు ఇవ్వగా, కొన్ని విక‌టించాయిని చెప్పారు.  

వాట‌న్నింటికీ శాశ్వ‌త నివార‌ణ కావాల‌ని, తెలంగాణ రైతాంగం ఎలాంటి అటుపోట్ల‌కు గురికావొద్ద‌నే ఉద్దేశంతోనే కొత్త రెవెన్యూ చ‌ట్టం కోసం నిర్ణ‌యం తీసుకున్నామని తెలిపారు. ఒక త‌ప్పు జ‌రిగితే అనేక త‌రాలు ఇబ్బంది పడుతాయని అంటూ త‌ప్ప‌ట‌డుగులు లేకుండా స‌రైన పంథాలో ముందుకెళ్లాల‌ని క‌ఠినమైన నిర్ణ‌యం తీసుకున్నామని చెప్పారు. 

‘‘ఒకప్పుడు భూమి ఉత్పత్తి సాధనం మాత్రమే. సాగువిధానంలో అధునాతన మార్పులు వచ్చి ఆస్తిగా మారింది. రైతుల భూములకు సంపూర్ణ రక్షణ ఉండాలని ధరణి పోర్టల్‌ రూపకల్పన చేశాం. కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు ధరణి పోర్టల్‌లో ఉన్నాయి. విదేశాల్లో ఉన్న వాళ్లు కూడా వారి భూముల వివరాలు ఈ పోర్టల్ ద్వారా చూసుకోవచ్చు”  అని కేసీఆర్ వివరించారు.

ధరణి పోర్టల్‌తో అక్రమ రిజిస్ట్రేషన్లకు తావు ఉండదని చెబుతూ  మీ-సేవ, ధరణి పోర్టల్‌, వ్యక్తిగతంగా కార్యాలయానికి వెళ్లి భూముల రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని తెలిపారు. ధరణి పోర్టల్‌ నమూనా పత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయని చెబుతూ నమూనా పత్రాల ఆధారంగా ఎవరికి వారే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేసుకోవచ్చని పేర్కొన్నారు