రాజధాని రైతుల చేతులకు బేడీలు  

రాజధాని అమరావతి ప్రాంత రైతులను బేడీలు వేసి పోలీసులు కోర్టుకు తరలించారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాజధాని రైతులు ఈ నెల 22న పలు ఆందోళనలు చేయడం, మూడు రాజధానులకు మద్ధతుగా తమకు రాజధాని గ్రామాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ మరికొంత మంది నిరసనకు దిగడం జరిగింది. 
 
ఈ సందర్భంగా ఇరుగ్రూపుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రవి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలేనికి చెందిన ఏడుగురు రైతులపై పోలీసులు ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తరువాత జరిగిన చర్చల్లో రవి తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటానని చెప్పినా పోలీసులు నిరాకరించారు. 
 
ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తరువాత కేసు వెనక్కి తీసుకోవడం కుదరదని, కోర్టులో తేల్చుకోవాలని డిఎస్‌పి దుర్గాప్రసాద్‌ తేల్చి చెప్పారు. కృష్ణాయపాలేనికి చెందిన ఏడుగురు రైతులను పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో ఈ నెల 26న హాజరు పర్చారు. రైతులకు కోర్టు రిమాండ్‌ విధించింది.
 
కరోనా పరీక్షల అనంతరం పోలీసులు వారిని అదే రోజు నర్సారావుపేట సబ్‌జైలుకు తరలించారు. మంగళవారం వారిని నర్సరావుపేట కోర్టు నుంచి గుంటూరు జిల్లా జైలుకు ఆర్‌టిసి బస్సులో తరలించే సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా బేడీలు వేసి తీసుకువచ్చారు. 
 
ఇద్దరిద్దరికి చొప్పున చేతులకు బేడీలు వేసి మరీ రిమాండుకు పంపించారు. కరుడుగట్టిన నేరస్తులు, బందిపోటు దొంగలు, తీవ్రవాదులు, రౌడీషీటర్లు, శిక్ష పడిన ఖైదీలకు భద్రతా కారణాల దృష్ట్యా చేతులకు బేడీలు వేస్తుంటారు. కొన్ని ప్రత్యేక కేసుల్లో కోర్టు అనుమతి తీసుకుని బేడీలు వేయటం సహజంగా జరుగుతుంది.