ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్‌కు క‌రోనా పాజిటివ్

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కరోనా వైరస్‌ బారిన పడ్డారు. తనకు కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చినట్లు ఆదివారం ట్వీట్ట‌ర్ ద్వారా తెలిపారు. అయితే తనకు ఎలాంటి క‌రోనా వ్యాధి లక్షణాలూ లేవని, ప్రస్తుతానికి ఆరోగ్యం అంతా బాగానే ఉందని పేర్కొన్నారు. 

పాజిటివ్ అని తేల‌డంతో సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లినట్లు, తనను ఇటీవల కలిసిన వారు అప్రమత్తంగా ఉండాలని శక్తికాంత దాస్‌ సూచించారు. క్వారంటైన్‌లో ఉంటూనే తన కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు తెలిపారు. 

తాను క‌రోనా బారిన ప‌డినా.. ఆర్‌బీఐ యథావిధిగా పనిచేస్తుందని చెప్పారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు, ఇతర అధికారులతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌, టెలిఫోన్ల ద్వారా అందుబాటులో ఉంటానని శక్తికాంత దాస్‌ చెప్పారు. 

కాగా, దేశంలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతోంది. రికవరీల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు 60 వేలకు దిగువకు.. వెయ్యి లోగా మరణాలు చోటుచేసుకోవడం కాస్త ఊరట కలిగించే అంశం.
ప్రస్తుతం దేశంలో 8.50 శాతం యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది.   దేశ వ్యాప్తంగా దాదాపు 90 శాతం మంది కరోనా నుండి కోలుకున్నట్లు  వెల్లడించింది. మొత్తం కేసుల్లో 8.50 శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులున్నాయి. మరణాల రేటు 1.51 శాతానికి తగ్గిందని పేర్కొంది.