పాక్ మళ్లీ ‘గ్రే లిస్టు’కే పరిమితం

టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్ డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏ‌టీఎఫ్) పాకిస్థాన్‌ను మళ్లీ ‘గ్రే లిస్టు’కే పరిమితం చేయనుంది. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ఎ ఫ్‌ఏ‌టీఎఫ్ యాక్షన్ ప్లాన్‌లోని 27 పాయింట్లను పూర్తిగా అమలు చేయడంలో విఫలమైంది. 
 
దీంతో ఆ దేశం మళ్లీ గ్రే లిస్టుకే పరిమితం కానుంది. మూడు రోజులుగా జరుగుతున్న ఎఫ్ఏటీఎఫ్ వర్చువల్ ప్లీనరీ సెషన్‌ ముగిసింది.  పాకిస్థాన్‌కు ఇచ్చిన యాక్షన్ ప్లాన్ డెడ్‌లైన్‌లు అన్నీ ముగిసిపోయినట్టు ఎఫ్‌ఏటీఎఫ్ ప్రకటించింది. 

జూన్ 2018లో పాకిస్థాన్‌ను ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులో చేర్చింది. అప్పటి నుంచి రెండేళ్లుగా ఆ జాబితా నుంచి పాక్ బయటపడలేకపోతోంది. మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు ఆర్థిక సాయంపై ఉక్కుపాదం మోపాలని, 2019 నాటికి తామిచ్చిన యాక్షన్ ప్లాన్‌ను పూర్తిగా అమలు చేయాలని పాకిస్థాన్‌ ప్రభుత్వాన్ని ఎఫ్ఏటీఎఫ్ కోరింది.

ఈ మేరకు 27 అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను సూచించింది. అయితే, వీటిలో 21 అంశాల్లో మాత్రమే చర్యలు తీసుకున్న పాక్.. ముఖ్యమైన ఆరు పాయింట్లను విస్మరించింది.

భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులైన మౌలానా మసూద్ అజర్, హఫీజ్ సయాద్‌లపై చర్యలు తీసుకోవడంలోనూ మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో ఆ దేశాన్ని మరోమారు గ్రే లిస్టుకే పరిమితం చేయనుంది. 

కాగా, కరోనా మహమ్మారి కారణంగా గడువును పొడిగించిన ఎఫ్ఏటీఎఫ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికైనా పూర్తి యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని కోరింది.