గిర్నార్ రోప్‌వేను ప్రారంభించిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని గిర్నార్‌లో రోప్‌వేను శనివారం ప్రారంభించారు. రోప్‌వే‌తో స్థానికులకు మెరుగైన సౌకర్యాల కల్పన జరగడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. గిర్నార్ రోప్‌వేతో పాటు గుజరాత్‌లో మరో రెండు ప్రాజెక్టులను వీడియో లింక్ ద్వారా ప్రధాని ప్రారంభించారు. 

 ‘గిర్నార్ పర్వతంపై దేవీ అంబ ఉంది. గోరఖ్‌నాథ్ పీక్‌, గురు దత్తాత్రేయ పీక్, జైన్ ఆలయం కూడా గిర్నార్ కొండలపై ఉన్నాయి. పర్వత ప్రాంతంపైకి చేరాలంటే మెట్లు ఎక్కి వెళ్లాలి. అక్కడకు వెళ్లిన వారిలో ఒకరకమైన శక్తి, ప్రశాంతత ద్యోతకమవుతాయి. ఇప్పుడు ప్రపంచ స్థాయి రోప్‌-వేతో ప్రతి ఒక్కరూ కూడా ఈ పర్వత ప్రాంతాలను చూడవచ్చు’ అని ప్రధాని పేర్కొన్నారు. 

గిర్నార్ రోప్-పే ప్రారంభంతో మెరుగైన సౌకర్యాల కల్పన జరగడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయని చెప్పారు. తొలుత గిర్నార్ రోప్‌వేలో 25 నుంచి 30 క్యాబిన్లు ఉంటాయి. ఒక్కో క్యాబిన్‌లో 8 మంది ఎక్కే అవకాశం ఉంటుంది. 2.3 కిలోమీటర్ల దూరాన్ని రోప్‌వేతో కేవలం 7.5 నిమిషాల్లో చేరుకోవచ్చు.

గిర్నార్ పర్వతం చట్టుపక్కల ఉన్న ఆకుపచ్చని అందాలను తనివితీరా ఆస్వాదించవచ్చు. రోప్‌వే సౌకర్యంతో పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

కోవిడ్ మహమ్మారి ప్రారంభం కాక ముందు స్టాట్యూ ఆఫ్ యూనిటీని 45 లక్షల మందికి పైగా దర్శించారు. ఇప్పుడు తిరిగి ప్రారంభమైంది. పర్యాటకుల తాకిడి కూడా గణనీయంగా పెరుగుతోంది.

ఇటీవల శివపూర్ బీచ్‌కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ అందుకుంది. అలాంటి ప్రాంతాలను అభివృద్ధి చేయడం వల్ల మరింత మంది పర్యాటకు పెరిగి, ఆదాయంతో పాటు, ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయని ప్రధాని మోదీ తెలిపారు.

కిసాన్ సూర్యోదయ యోజన, అహ్మదాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో టెలికార్డియాలజీ మొబైల్ యాబ్, పీడియాట్రిక్ హార్డ్ హాస్పిటల్, గిర్నార్ రోప్‌వే వంటివి బలమైన, ఆధ్యాత్మిక, ఆరోగ్య గుజరాత్‌కు నిదర్శనంగా నిలుస్తాయని చెప్పారు.