‘స్టార్స్‌’ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం  

నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ) కింద రాష్ట్రాలల్లో పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ‘స్టార్స్‌’ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం  పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. 
 
ఎన్‌ఈపీ-2020 అమలును మోదీ ప్రభుత్వం  ప్రారంభించిందని  కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మీడియాకు వెల్లడించారు. 
ఇందులో భాగంగా స్టార్స్‌ (స్ట్రెంతెనింగ్‌ టీచింగ్‌-లెర్నింగ్‌ అండ్‌ రిజల్ట్స్‌ ఫర్‌ స్టేట్స్‌) ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.
 
 హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కేరళ, ఒడిశా రాష్ట్రాలలో దీనిని అమలుచేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం రూ.5,718 కోట్లు కాగా, ప్రపంచ బ్యాంకు రూ.3,700 కోట్ల సాయం అందించనున్నదని వెల్లడించారు.   
 
కాగా, నేషనల్‌ రూరల్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌ (ఎన్‌ఎల్‌ఆర్‌ఎం) కింద జమ్ముకశ్మీర్‌, లఢక్‌కు రూ.520 కోట్ల ప్యాకేజీ అందించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్ని కేంద్ర పథకాలను జమ్ముకశ్మీర్‌, లఢక్‌లో పూర్తిస్థాయిలో అమలుచేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇలా ఉండగా, భారత్‌లోని వ్యూహాత్మక నిల్వల కేంద్రాల్లో స్టోర్‌ చేసిన తమ క్రూడాయిల్‌లో 50 శాతం వరకు విక్రయించేందుకు అబుదాబి నేషనల్‌ ఆయిల్‌ కంపెనీ (ఏడీఎన్‌వోసీ)కి కేంద్ర మంత్రివర్గం అనుమతించింది. 
 
ఈ నిర్ణయం వల్ల  ఆ కంపెనీ భారత్‌లో మరింత ఎక్కువగా చమురును నిల్వచేసేందుకు ప్రోత్సా హం లభిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇంధన కొరత తలెత్తకుండా విశాఖపట్నం, మంగళూరు, పాడూర్‌లలో భారత్‌ వ్యూహాత్మక నిల్వల కేంద్రాలను నిర్మించింది.