విదేశీ విరాళాల ఖాతాలన్నీ ఎస్బీఐ ప్రధాన శాఖలోనే

విదేశీ విరాళాలను పొందే ఎన్జీవోలన్నీ వచ్చే ఏడాది మార్చి 31లోగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) న్యూఢిల్లీ శాఖలో ఎఫ్‌సీఆర్‌ఏ ఖాతాలు తెరవాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. 
 
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ)-2020 కింద రిజిస్టరైన ఎన్జీవోలు 2021 ఏప్రిల్‌ 1 నుంచి మరే ఇతర బ్యాంకు శాఖ ద్వారా విదేశీ విరాళాలు పొందకూడదని ఆ శాఖ పునరుద్ఘాటించింది. 
 
ఈ చట్టాన్ని పార్లమెంట్‌ గత నెలలో ఆమోదించింది. విదేశీ విరాళాలను పొందేందుకు ఎన్జీవోలు, సంఘాలు న్యూఢిల్లీ ఎస్బీఐ ప్రధాన శాఖలో డిజిగ్నేటెడ్‌ బ్యాంకు ఖాతాను కలిగి ఉండటాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఈ చట్టంలో ప్రత్యేక నిబంధనను పొందుపర్చింది. 
 
ప్రస్తుతం ఎఫ్‌సీఆర్‌ఏ కింద 22,434 ఎన్జీవోలు, సంఘాలు రిజిస్టరై ఉన్నాయి. విదేశీ విరాళాల కోసం ఎఫ్‌సీఆర్‌ఏ ఖాతాను తెరిచేందుకు న్యూఢిల్లీ 11 సన్సద్‌ మార్గ్‌లోని ఎస్బీఐ ప్రదాన శాఖ (ఎన్‌డీఎంబీ)ను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. 
 
అయితే ఈ ఖాతాను ఖాతాను తెరిచేందుకు దరఖాస్తుదారులు ప్రత్యేకంగా ఢిల్లీలోని ఎస్బీఐ ప్రధాన శాఖను సందర్శించాల్సిన అవసరం లేదని, సమీపంలోని ఎస్బీఐ శాఖను సంప్రదించి కూడా ఈ ఖాతాను తెరవవచ్చని కేంద్ర హోం శాఖ వివరించింది.