హత్రాస్‌ పై సీబీఐ విచారణకు సీఎం యోగి ఆదేశం

హత్రాస్‌ జిల్లాలో దారుణహత్యకు గురైన 19 ఏండ్ల బాలిక మృతిపైనిజానిజాలను నిగ్గుతేల్చేందుకు సీబీఐ విచారణకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించారు.

బాలిక హత్యోదంతంపై దర్యాప్తు జరిపేందుకు ఉన్నతాధికారులతో కూడిన స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ బృందాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇప్పటికే సిట్ శుక్రవారం ముఖ్యమంత్రి యోగికి ప్రాథమిక నివేదికను సమర్పించింది. 

సిట్‌ సూచనల మేరకే ముఖ్యమంత్రి జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌లను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. వారందరికీ నార్కో ఎనాలిసిస్‌, పాలిగ్రాఫ్‌ పరీక్షలు చేయాలని ఆదేశించారు. దాంతో పాటు కొత్త ఎస్పీగా వినీత్‌ జైశ్వాల్‌ను నియమించారు.

ఇలాఉండగా, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, మరో ముగ్గురు పార్టీ నాయకుల ప్రతినిధి బృందం బాధిత దళిత బాలిక కుటుంబాన్ని హత్రాస్‌లోని బూల్‌గారి గ్రామంలోని వారి ఇంట్లో గత సాయంత్రం కలిసింది.

బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు. బాధిత  బాలిక కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని రాహుల్‌, ప్రియాంక్‌ చెప్పారు.

ఉత్తరప్రదేశ్ హోంశాఖ కార్యదర్శి అవనిష్ అవస్థీ, డీజీపీ హెచ్‌సి అవస్థీ కూడా బాధితుడి కుటుంబాన్ని నిన్న కలుసుకున్నారు. ఈ విషయాన్ని పరిశీలిస్తున్న సిట్ ద్వారా వారి సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.

హత్రాస్ ఘటనపై ఢిల్లీతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఈ సంఘటనలో లైంగికదాడి జరగలేదని యూపీ పోలీసులు పోస్ట్ మార్టం, ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఫలితాలను ఉదహరిస్తున్నారు.

హత్రాస్ సంఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ మంత్రి ఎస్‌కే ఖన్నా శనివారం మాట్లాడుతూ “పోస్టుమార్టం, ఫోరెన్సిక్, వైద్య నివేదికల ఆధారంగా లైంగికదాడి జరిగినట్లు నిర్ధారించబడలేదు. ఇప్పటికీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి ఐదుగురు అధికారులపై చర్యలు తీసుకున్నది. సిట్ నివేదిక దాఖలు చేసిన వెంటనే ఆదర్శవంతమైన దర్యాప్తు అనుసరిస్తుంది” అని చెప్పారు.