పాక్ కాల్పుల్లో ముగ్గురు భారత జవానుల మృతి 

జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ జరిపిన కాల్పుల్లో వేర్వేరు చోట్ల ముగ్గురు భారత జవాన్లు అమరులయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. 

భారత స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న పాక్ మోర్టార్లతో గుళ్ల వర్షం కురిపించగా దీటుగా సమాధానం చెప్పినట్టు ఆర్మీ తెలిపింది. 

ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా నౌగామ్ సెక్టార్‌లో పాక్ ఆర్మీ మోర్టార్లతో కాల్పులు ప్రారంభించినట్టు రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు భారత జవాన్లు అమరులు కాగా, నలుగురు గాయపడినట్టు పేర్కొన్నారు. భారత్ కాల్పుల్లో పాక్‌వైపు ఎలాంటి నష్టం జరిగిందీ తెలియరాలేదు.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఈ ఉదయం పూంచ్ సెక్టార్‌లో పాక్ జరిపిన కాల్పుల్లో ఓ జవాను అమరుడు కాగా, మరొకరు గాయపడ్డారు. గత 8 నెలల్లో పాక్ 3వేల సార్లకు పైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

 గత 17 ఏళ్లలో ఈస్థాయిలో పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడడం ఇదే తొలిసారి. కాగా, 2003లో భారత్-పాక్‌లు నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి.