‘హత్రాస్’ యువతిపై అత్యాచారం జరగలేదు

దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు సృష్టించిన ‘హత్రాస్’ అత్యాచారం, హత్య కేసుపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు సంచలన విషయాన్ని వెల్లడించారు.  బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించిన్నట్లు తెలిపారు.

బాధితురాలి మెడపై గాయమవడంతో, తట్టుకోలేనంత స్థాయిలో ఉన్న ఆ బాధ ఆమె మరణానికి కారణమైందని పోలీసులు ఉత్తర ప్రదేశ్ అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు.

దళిత యువతి మరణానికి కారణం ఆమె మెడపై తగిలిన గాయమని, ఆ గాయం వల్ల ఏర్పడిన తట్టుకోలేనంత బాధ అని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించినట్లు చెప్పారు. 

‘‘ఎఫ్ఎస్ఎల్ (ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ) నివేదిక కూడా వచ్చింది. నమూనాల్లో వీర్యం లేదని ఈ నివేదిక స్పష్టంగా చెప్తోంది. దీనినిబట్టి అత్యాచారం లేదా సామూహిక అత్యాచారం జరగలేదని స్పష్టమవుతోంది’’ అని ప్రశాంత్ కుమార్ చెప్పారు. 

బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కూడా అత్యాచారం గురించి పేర్కొనలేదని, తనను కొట్టడం గురించి మాత్రమే మాట్లాడిందని చెప్పారు. 

సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేందుకు, కులపరమైన హింసను సృష్టించేందుకు కొందరు వాస్తవాలను వక్రీకరించారని చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో తక్షణ చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేందుకు, కులపరమైన హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నించినవారిని గుర్తిస్తామని చెప్పారు. మీడియాలో కూడా వాస్తవాలను వక్రీకరించారని ధ్వజమెత్తారు.