ఫార్మసిటీ వద్దంటూ రైతుల నిరసన 

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన ఫార్మాసిటీ వద్దంటూ రైతులు అధికారులతో గొడవకు దిగారు. ఫార్మాసిటీ రోడ్డు సర్వే కోసం అధికారులు వారం క్రితం మేడిపల్లికి వెళ్లగా రైతులు వారిని అడ్డుకున్నారు. 
 
దాంతో ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటాచారి బుధవారం నందివనపర్తి రైతులతో సమావేశమయ్యారు. ఆ సమావేశానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు వచ్చి తమ ప్రాంతంలో ఫార్మాసిటీ వద్దంటూ గొడవకు దిగారు. 
 
అన్ని గ్రామాల రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలని రైతులు, యాచారం ఎంపీపీ సుకన్య, కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండ రెడ్డి ఆర్డీవోను డిమాండ్ చేశారు. 
 
ఫార్మసీటీపై అధికారుల ఏకపక్ష తీరును నిరసిస్తూ రైతులు అధికారుల పైకి కుర్చీలు విసరడంతో.. పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకొని యాచారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.