‘ఆత్మనిర్భర భారత్’ లో రైతుల పాత్రే కీలకం

`ఆత్మ నిర్భర భారత్’ లో రైతులదే కీలక పాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రైతులు పండించిన పంటలను మార్కెట్ కమిటీలకు తెచ్చి, అమ్ముకోవడం ద్వారా రైతులు కొన్ని రాష్ట్రాల్లో లాభాలు ఆర్జించారని చెప్పారు. 

మన్ కీ బాత్ 69 సెష‌న్‌లో భాగంగా ఆదివారం ఆయ‌న రేడియో ద్వారా దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగీస్తూ  “కోవిడ్ సమయంలో మన వ్యవసాయ రంగం తన పరాక్రమాన్ని చూపించింది. స్వావలంబన భారతాన్ని నిర్మించే ప్రయత్నంలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారు.’’ అని మోదీ కొనియాడారు.

కొత్త బిల్లులతో కనీస మద్దతు ధరకు నష్టం వాటిల్లదని, అది ఉంటుందని, ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాన్ని కాంగ్రెస్ వారు పాటించి ఉంటే.. ‘స్వావలంబన భారత్’ నినాదం అవసరముండేదే కాదని చెప్పారు. భారత్ కొన్ని సంవత్సరాల కిందటే స్వావలంబన భారత్ గా ఎదిగి ఉండేదని ఆయన పేర్కొన్నారు. 

మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ కథలు చెప్పే కళను, కుటుంబ వ్యవస్థను ఉటంకించారు. కరోనా మహమ్మారి కుటుంబ వ్యవస్థను, విలువలను పెంచిందని, కుటుంబ సంబంధాలను మరింత దగ్గర చేసిందని చెప్పారు. 

కానీ కొన్ని కుటుంబాల్లో సమస్యలున్నాయని, వారు ‘విలువల’తో సంబంధాన్ని కోల్పోయారని, అలాంటి వారికి కథలెంతో సహాయపడతాయని ఆయన తెలిపారు.

‘‘భారతదేశంలో కథలు చెప్పే సంప్రదాయం ఉంది. తమిళనాడు, కేరళలో ఈ సంప్రదాయం విశేషంగా ఉంది. ఈ సంప్రదాయాన్ని వారు ‘విల్లుపట్టు’ అంటారని మోదీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘బెంగళూరు కథా సమూహం’ సభ్యులతో ప్రధాని ముచ్చటించారు. 

స్వాతంత్య్ర సమయంలో జరిగిన కథలు, స్వాతంత్య్రం కోసం పోరాడిన వారి వీరగాథలను ఈ తరానికి చెప్పాలని మోదీ వారికి విజ్ఞప్తి చేశారు. ‘హితోపదేశం, పంచతంత్ర’ అన్న కథల సంప్రదాయం  మన దేవంలో ఉందని, కథల్లో జంతువులు, పక్షుల వివరణ ఉంటుందని ,దీని ద్వారా మన ఊహా శక్తి పెరుగుతుందని మోదీ పేర్కొన్నారు.