పాక్‌, చైనా ప్రాజెక్టులను చట్టవిరుద్ధంగా ప్రకటించాలి

పాకిస్థాన్‌, చైనా మధ్య జరుగుతున్న బెల్డ్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్ ప్రాజెక్టులను చట్టవిరుద్ధంగా ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రకటించాలని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)కు చెందిన హక్కుల కార్యకర్త డాక్టర్ అమ్జాద్ ఎ మీర్జా డిమాండ్‌ చేశారు. 
 
జెనీవాలో జరిగిన ఐరాస మానవ హక్కుల మండలి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగీస్తూ గిల్గిట్‌ బాల్టిస్థాన్‌లో రెండు వలసరాజ్యాలను తాము ఎదుర్కొంటున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌, చైనా మధ్య జరుగుతున్న బెల్డ్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్ ప్రాజెక్టుల వల్ల ఈ ప్రాంతానికి దారుణ నష్టం జరుగుతున్నదని  ఆందోళన వ్యక్తం చేశారు. 
 
డ్యాముల నిర్మాణం వల్ల నదులు కుదించుకుపోతున్నాయని ఆరోపించారు. దీని వల్ల పర్యావరణం దెబ్బతినడంతోపాటు తాగు నీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉన్నదని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని, అయినా కూడా పాకిస్థాన్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని డాక్టర్ అమ్జాద్ ఎ మీర్జా విమర్శించారు. 
 
ఈ ప్రాజెక్టుల ఆర్థిక భారమంతా భవిష్యత్తులో తమపైనే పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌, చైనా మధ్య జరుగుతున్న బెల్డ్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్ ప్రాజెక్టులను చట్టవిరుద్ధంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించాలని ఆయన కోరారు.