వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 3.9% రికవరీ    

కరోనా సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుంగదీసిందని ఐక్యరాజ్య సమితి (ఐరాస) పేర్కొన్నది. దీని ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో భారత్‌ 5.9% ప్రతికూల వృద్ధిరేటును నమోదు చేయవచ్చని అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 3.9% రికవరీని సాధించే అవకాశమున్నదని తెలిపింది.
అయినప్పటికీ ప్రస్తుత క్షీణత శాశ్వత ఆదాయ నష్టానికి దారితీయవచ్చని అభిప్రాయపడింది. యునైటెడ్‌ నేషన్స్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (యూఎన్‌సీటీఏడీ) కాన్ఫరెన్స్‌లో విడుదల చేసిన ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రిపోర్ట్‌-2020లో ఐరాస ఈ అభిప్రాయాలను వ్యక్తం చేసింది.
కొవిడ్‌-19 వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, ఫలితంగా ఈ ఏడాది 4.3% ప్రతికూల వృద్ధి నమోదు కావచ్చని తెలిపింది. ఈ ఏడాది దక్షిణాసియా వృద్ధిరేటు 4.8% క్షీణిస్తుందని, వచ్చే ఏడాది ఇది 3.9% పుంజుకునే అవకాశం ఉన్నదని యూఎన్‌సీటీఏడీ అంచనా వేసింది.
అలాగే 2020లో అమెరికా వృద్ధి రేటు -5.4%గా నమోదవుతుందని, వచ్చే ఏడాది ఇది 2.9% రికవరీ సాధించవచ్చని తెలిపింది. చైనాలో మాత్రం ఈ ఏడాది 1.3% వృద్ధి నమోదవుతుందని, వచ్చే వచ్చే ఏడాది గణనీయంగా 8.1 శాతానికి పుంజుకోవచ్చని ఐరాస అభిప్రాయపడింది.