ఫ్రాన్స్ నుంచి భారత్కు వచ్చిన రఫేల్ యుద్ధ విమానాలు బుధవారం అధికారికంగా భారత వాయుసేనలో చేరాయి. అంబాలా ఎయిర్ బేస్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారత రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణమంత్రి ఫ్లోరెన్ పార్లె ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఇటీవల తాను విదేశీ టూర్కు వెళ్లానని, అక్కడ భారత్ అభిప్రాయాన్ని సుస్పష్టం చేసినట్లు తెలిపారు. ఎటువంటి పరిస్థితుల్లో తమ భూభాగాన్ని వదులుకునేది లేదని తేల్చిచెప్పినట్లు గుర్తు చేశారు.
భారతీయ వాయుదళానికి కంగ్రాట్స్ చెబుతున్నానని, కానీ సరిహద్దుల్లో ఉన్న పరిస్థితులు దురదృష్టకరమని, ఎల్ఏసీ వద్ద మీరు చేపట్టిన చర్యలు మీరెంత కట్టుబడి ఉన్నారో చెబుతుందని రాజ్నాథ్ తెలిపారు. ఫార్వర్డ్ బేస్ల వద్ద ఐఏఎఫ్ దళాలు చాలా వేగంగా తమ ఆయుధ సంపత్తిని చేర్చాయని, దీంతో వాయుదళం ఎంత సంసిద్ధంగా ఉందో తెలుస్తోందని పేర్కొన్నారు.
రాఫేల్ రాకతో భారత్, ఫ్రాన్స్ మధ్య బంధం బలోపేతమైందని తెలిపారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు కూడా బలపడ్డాయని చెబుతూ రాఫేల్ కోసం ఎన్నో అవాంతరాలు ఏర్పడ్డాయని, కానీ ప్రధాని మోదీ బలమైన కాంక్ష వల్ల ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, వసుదైక కుటుంబం అన్న సూత్రాలకు రెండు దేశాలు కట్టుబడి ఉన్నట్లు రాజ్నాథ్ తెలిపారు. రాఫేల్ ఇండక్షన్ కార్యక్రమంలో ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పాల్గొనడం రెండు దేశాల మధ్య బలమైన రక్షణ భాగస్వామ్యాన్ని గుర్తు చేస్తోందని చెప్పారు.
ప్రపంచ శాంతి కాంక్షతోనే తాము తమ రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు రాజ్నాథ్ తెలిపారు. శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా తాము ఎప్పుడూ ప్రవర్తించబోమని స్పష్టం చేశారు.
ఈ రోజు భారత ఆర్మీలో చేరిన 5 యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి జూలై 27న భారత్కు వచ్చాయి. కానీ.. అధికారికంగా మాత్రం నేడు ఎయిర్ ఫోర్సులోకి చేరాయి. ఈ విమానాలు గోల్డేన్ యారోస్లో భాగం కానున్నాయి. ఈ రఫేల్ విమానాలకు సంప్రదాయం ప్రకారం సర్వ ధర్మ పూజ నిర్వహించారు.
తొలుత రాఫేల్ విమానం చుట్టూ సుఖోయ్-30, జాగ్వార్ విమానాలు గాలిలో ఎగురుతూ వందనం చేశాయి. అత్యద్భుతంగా ఎయిర్ఫో నిర్వహించారు. తేజస్ యుద్ధ విమానాలు కూడా రాఫేల్కు స్వాగతం పలికాయి. గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్లో చేరిన రాఫేల్స్కు వాటర్ కెనాన్ సెల్యూట్ కూడా నిర్వహించారు.
దీంతో భారత వాయుసేనలో కొత్త అధ్యాయం మొదలైంది. 36 రాఫెల్స్ కోసం 59వేల కోట్ల ఒప్పందం జరిగింది. తొలుత 5 రాఫేల్స్ వచ్చాయి. వచ్చే నెలలో మరో నాలుగు రాఫెల్ విమానాలు భారత్ కు రానున్నాయి.
More Stories
డబ్బులేకే పోటీ చేయడం లేదు .. నిర్మలా
రేవంత్ పక్కన ఉన్నవాళ్లే ఫోన్ ట్యాపింగ్ చేశారు
రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు