సంజయ్‌రౌత్‌ పురుష అహంకారి   

తనపై విమర్శలు చేస్తున్నవారిపై బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ మరోసారి విరుచుకుపడ్డారు. ముఖ్యంగా శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ పురుష అహంకారి అని విమర్శించారు. భారతీయ మహిళలపై ఇన్న ఘోరాలు, అఘాయిత్యాలు జరగడానికి ఇలాంటి పురుష అహంకారమేనని కంగనా ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తాను మహారాష్ట్రవాసిని కాదన్న సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యల్ని ఆమె ఖండించారు.  గతంలో ముంబై మహా నగరంలో బతకలేకపోతున్నామని చెప్పిన ఆమిర్‌ ఖాన్‌, నసీరుద్దీన్‌ షాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కంగనా ప్రశ్నించారు. 
 
ఒక మహిళను అయినందునే శివసేన ఎంపీ రెచ్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం కంగనా ట్విటర్‌లో వీడియో విడుదల చేశారు.   సెప్టెంబర్‌ 9 న ముంబై వస్తున్నానని, దమ్ముంటే తనను అడ్డుకోవాలని ఆమె విమర్శకులకు సవాల్‌ విసిరారు.
ఇలా ఉండగా,  కంగ‌నా ర‌నౌత్‌కు వై-క్యాట‌గిరీ  భద్రత క‌ల్పించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.  ఆమెకు ఓ ప‌ర్స‌న‌ల్ సెక్యూర్టీ ఆఫీస‌ర్‌తో పాటు 11 మంది పోలీసులు భ‌ద్ర‌త‌గా ఉంటార‌ని  ప్ర‌భుత్వ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.  కంగ‌నాకు క‌ల్పించే భ‌ద్ర‌త‌లో క‌మాండోలు కూడా ఉండ‌నున్న‌ట్లు హోంశాఖ వ‌ర్గాల ద్వారా వెల్ల‌డైంది.  
 
హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కూడా ముంబైలో కంగ‌నాకు భ‌ద్ర‌త క‌ల్పించే యోచ‌న‌లో ఉన్న‌ది. కంగ‌నాకు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఆమె సోద‌రి, తండ్రి త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ట్లు హిమాచ‌ల్ ముఖ్యమంత్రి జైరాం థాకూర్ తెలిపారు.   
 ప్రస్తుతం ఆమె సిమ్లాలోని తన సొంతింట్లో ఉన్నారు. కాగా, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని కంగనా అసహనం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే.
మంబై పోలీసులపై నమ్మకం లేకుంటే ఇక్కడకు రావొద్దని సంజయ్‌ రౌత్‌ కంగనాకు కౌంటర్‌ ఇచ్చారు. ఎంపీ సంజయ్‌ బహిరంగంగా తనకు వార్నింగ్‌ ఇస్తున్నారని, ఇప్పడు తనకు ముంబై పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లా కనిపిస్తోందని కంగనా కామెంట్‌ చేయడంతో వివాదం మరింత ముదిరింది.
‘కంగనా సోదరి నాతో టెలిఫోన్ లో మాట్లాడింది. భద్రత కల్పించాలని కోరుతూ ఆమె తండ్రి రాష్ట్ర  పోలీస్ శాఖకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రక్షణ ఏర్పాట్లు చేయాలని డీజీపీకి చెప్పా. కంగనా హిమాచల్ ఆడబిడ్డ. ఆమె సెలబ్రిటీ కూడా అయినందున సెక్యూరిటీ కల్పించడం మా బాధ్యత’ అని జైరాం ఠాకూర్ స్పష్టం చేశారు.