దేశంలోనే అతిపొడవైన కనకదుర్గా ఫ్లై  ఓవర్‌ సిద్ధం  

దేశంలోనే అతి పొడవైన విజయవాదాలని కనకదుర్గా ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది.  కేంద్ర  ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 4న ప్రారంభోత్సవం చేయవలసి ఉన్నప్పటికీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖేర్జీ మరణం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం జాతీయ సంతాప దినాలు వారం రోజులను ప్రకటించడంతో వాయిదా పడే అవకాశం ఉంది. 

దేశంలోనే అత్యద్భుత ఫ్లై ఓవర్‌ కావటంతో ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది.  వర్చువల్‌ ప్రారంభోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఈ ఫ్లై ఓవర్‌ ఇంజనీరింగ్‌ అద్భుతాన్ని పరిచయం చేయాలని కేంద్రం నిర్ణయించింది.

దీని కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా డ్రోన్‌ బృందాన్ని విజయవాడకు పంపించింది. ఈ బృందం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఫ్లైఓవర్‌ అందాలను చిత్రీకరించింది.  చిత్రీకరణలో ఆర్‌అండ్‌బీ స్టేట్‌ హైవేస్‌ విభాగం అధికారులతో పాటు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మోర్టు) అధికారులు కూడా పాల్గొన్నారు.

ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా జాతీయ మీడియాలో ఫ్లైఓవర్‌కు సంబంధించిన డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నారు.  స్పైన్‌ అండ్‌ వింగ్స్‌  టెక్నాలజీతో ఒంటి స్తంభంపై ఆరు వరసలతో నిర్మించిన ఫ్లై  ఓవర్‌ కావటం చేత దీనికి  ప్రాధాన్యత  ఏర్పడింది.

దేశంలో ఢిల్లీ, ముంబయిల్లో మాత్రమే ఈ తరహా ఫ్లై ఓవర్లు ఉన్నాయి. అయితే ఆ రెండింటి కంటే అడ్వాన్స్‌ టెక్నాలజీతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. పైగా దేశంలోనే అతి పొడవైనది. ఈ టెక్నాలజీలో వై పిల్లర్స్‌  ఉండటం, వీటి నిడివి ఎక్కువగా ఉండటం కూడా ప్రత్యేకమని  చెప్పుకోవాలి. ఈ టెక్నాలజీలో దేశంలోని అతి పొడవైన ఆరు వరసల ఫ్లై ఓవర్‌ కావటంతో దేశానికి గర్వకారణమైన విషయంగా  కేంద్రం భావిస్తోంది.