నెల రోజులుగా కనిపించని కిమ్ సోదరి!

గత కొన్ని నెలలుగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్  ‌ ఆరోగ్య పరిస్థితిపై అనేక రకాల సందేహాలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ఆయన కోమాలోకి వెళ్లారని, ఏ క్షణమైనా మరణించే అవకాశం ఉందంటూ పలుమార్లు వదంతులు వ్యాపించాయి. అంతే కాదు ఆయన స్థానంలో ఆయన సోదరి కిమ్‌ యో జాంగ్‌ అధికార బాధ్యతలు చేబట్టిన్నట్లు కూడా కధనాలు వెలువడ్డాయి. 

కొంతకాలంగా ఆమె ముఖ్యంగా విదేశీ వ్యవహారాలలో దూకుడుగా వ్యవహరించడం సహితం అందుకు బలం చేకూరింది. అయితే గత నెల రోజులుగా ఆమె బహిరంగంగా కనిపించక పోవడం, ఏ కార్యక్రమంలో పాల్గొనక పోవడంతో ఆమె రాజకీయ పరిస్థితిపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

కిమ్‌ యో జాంగ్‌ను రెండో అధికార కేంద్రంగా గుర్తింపు పొందేందుకు కొంతకాలంగా ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. దిగేలా ఆయన కీలక చర్యలు తీసుకున్నారని వెల్లడించింది. కిమ్‌ సలహాదారుల్లో ఒకరైన జాంగ్‌.. ఆమె ఈ ఏడాది మార్చిలో దక్షిణ కొరియా విధానాలపై విరుచుకుపడుతూ అధికారిక ప్రకటన జారీ చేశారు.

తన సోదరుడిని విమర్శించే వారిని సంకర జాతి కుక్కలు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  పైగా, ఉభయ కొరియాల మధ్య చర్చలకు వేదికగా నిలిచిన అనుసంధాన కార్యాలయాన్ని పేల్చివేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఇక అగ్రరాజ్యం అమెరికాతోనూ దౌత్య పరమైన వ్యవహారాలకు సంబంధించి జూలైలో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒకానొక సమయంలో అంతర్జాతీయ మీడియాలో కిమ్‌ కంటే కూడా జాంగ్‌ పేరే ఎక్కువగా వినిపించే స్థాయికి చేరుకున్నారు. అయితే ఆ పాపులారీటియే ఇప్పుడు ఆమె పట్ల కిమ్‌ ఆగ్రహానికి కారణమైందని ఉత్తర కొరియా రాజకీయ విశ్లేషకుడు ఒకరు పేర్కొన్నారు. 

జూలై 27 తర్వాత జరిగిన ఏ ఒక్క బహిరంగ సమావేశానికి జాంగ్‌ హాజరుకాలేదు. అంతేగాక అధికార వర్కర్స్‌ పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యురాలైన ఆమె తాను పాల్గొనాల్సిన సమావేశాలకు కూడా హాజరుకావడం లేదు. తన కంటే సోదరి జాంగ్‌కే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుందని భావించిన కిమ్‌ ఆదేశాలు, ఆగ్రహం కారణంగానే ఆమె ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పలువురు భావిస్తున్నారు.

అంతేగాక దక్షిణ కొరియాపై సైనిక చర్యకు సిద్ధమంటూ జాంగ్‌ జారీ చేసిన ఆదేశాలను కిమ్‌ నిలిపివేశారు.   కిమ్‌ అనంతరం ఉత్తర కొరియాలో కీలక నేతగా ఎదిగే అవకాశం జాంగ్‌కే ఉన్నప్పటికీ  తన ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే ఆమెకు కట్టబెట్టిన అధికారాలను కత్తిరించేందుకు కిమ్‌ ఏమాత్రం వెనకాడబోరని వెల్లడి అవుతున్నది.

కాగా 1988లో జన్మించిన జాంగ్‌ స్విట్జర్లాండ్‌లో విద్యనభ్యసించారు. 2011లో తండ్రి కిమ్‌ జాంగ్‌ ఇల్‌ మరణానంతరం, సోదరుడు కిమ్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఆమె కూడా పార్టీలో చేరి అనతికాలంలోనే కీలక నేతగా ఎదిగారు. ఇకకిమ్‌ ఆరోగ్యంపై వదంతులు వ్యాపించిన ప్రతిసారీ జాంగ్‌ అన్నీ తానే అయి ముందుంటున్నారు.

అయితే అధికార మీడియా మాత్రం ఎప్పటికప్పుడు కిమ్‌ పార్టీ సమావేశాల్లో, అధికారిక చర్చల్లో పాల్గొన్నట్లుగా ఉన్న ఫొటోలను విడుదల చేస్తూ ఆయన పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారన్న సంకేతాలు ఇస్తూ ఉంది. కానీ ఆ ఫొటోలు తాజా చర్చలకు సంబంధించినవా లేదా పాత ఫొటోలా అన్న దానిపై మాత్రం స్పష్టత రావడం లేదు.