వచ్చే నెలలో నమూనా అద్దె చట్టం 

ఖాళీగా ఉండిపోయిన ఇండ్లను అద్దెకు ఇస్తూ రెంటల్‌ హౌజింగ్‌ సెక్టార్‌ను ప్రోత్సహించడంలో భాగంగా తీసుకొచ్చిన నమూనా అద్దె చట్టానికి వచ్చే నెలలో ప్రభుత్వం ఆమోదం లభించనున్నదని కేంద్ర గృహ, పట్టణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా తెలిపారు. 
 
అన్ని రాష్ట్రాలు  కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ కొత్త చట్టాన్ని అమలు చేయాలని సూచించారు. గృహరంగంపై అసోచామ్‌ బుధవారం నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడుతూ నమూనా అద్దె చట్టం అమల్లోకి వచ్చాక గృహాలకు సంబంధించిన పలు వివాదాలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
ఖాళీగా ఉన్న 60 నుంచి 80 శాతం ఇండ్లు రెంటల్‌ మార్కెట్లోకి వస్తాయని అంచనా వీసారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అమ్ముడుపోని నిర్మాణాలను అద్దె గృహాలుగా మార్చుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. 2019లో ఈ చట్టాన్ని కేంద్రం ప్రతిపాదించింది. 
 
యజమాని, అద్దెదారుడికి మధ్య తలెత్తే వివాదాలను జిల్లా కలెక్టర్‌ సమక్షంలో పరిష్కరించుకోవడం, ఇంటి అద్దె పెంచాలనుకుంటే.. యజమాని మూడు నెలల ముందు దాని గురించి నోటీసును ఇవ్వడం వంటి అంశాలను ఈ చట్టంలో చేర్చారు.