టీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ అసంతృప్తి  

కరోనా నియంత్రణలో టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై గవర్నర్ డా. తమిళశై సౌందరరాజన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కార్ క్రియాశీలకంగా వ్యవహరించలేదని విచారం వ్యక్తం చేశారు.  

రాష్ట్రంలో కరోనా తీవ్రతను కేసీఆర్  ప్రభుత్వం చాలా తక్కువగా అంచనా వేసిందని ఆమె విమర్శించారు. ఫార్మా హబ్‌, మెడికల్‌ హబ్‌ రాష్ట్రంగా ఈ విషయంలో ప్రభుత్వం మరింత గట్టిగా చర్యలు చేపట్టాల్సిందని అంటూ అలా జరగలేదని అమె పేర్కొన్నారు. వైద్య పరంగా అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుంటే రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉండేదని చెప్పారు. 

రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల తీరుపై ఓ ఆంగ్ల చానల్‌తో గవర్నర్‌ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 80 శాతం కరోనా కేసులు 10 రాష్ట్రాల నుంచే ఉన్నాయని ప్రధానమంత్రి మోదీ చెప్పారని, ఆ రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందని గవర్నర్‌ గుర్తు చేశారు. రోజుకు 50 కేసులు వచ్చే రాష్ట్రంలో ఆ సంఖ్య 2000-2600 దాకా వెళ్లిందను చెబుతూ  రాష్ట్రంలో కరోనా కేసులు లక్షకు చేరువ కావడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.

వైర్‌సను అదుపు చేసే విషయంలో గట్టిగా పని చేయాలంటూ వైద్య నిపుణురాలిగా ఉన్న అనుభవంతో తాను, మూడు నెలల క్రితమే ప్రభుత్వాన్ని హెచ్చరించానని గుర్తు చేశారు. వైరస్‌ వ్యాప్తి ప్రాథమిక దశలో ఉన్నప్పుడే కట్టడి కోసం చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి తాను ఆరు, ఏడు లేఖలను రాశానని.. రాష్ట్రంలో కరోనా తీవ్రతను నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కే తెలియజేసినా, పరీక్షల సంఖ్య పెంచాని కోరినా స్పందించలేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. 

ముందు జాగ్రత్త చర్యలపై చేసిన సూచనలేవీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే రాష్ట్రంలో కేసులు పెరిగాయని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలో 7 వేల వైద్యులతో పాటు 20 వేల మంది నర్సుల అవసరం ఉందని, వైద్యసిబ్బందితో పాటు బెడ్లను కూడా అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను పెంచాలని లేఖల ద్వారా నేరుగా సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేసినా ఫలితం రాలేదని గవర్నర్ విచారం వ్యక్తం చేశారు. 

కట్టడి ప్రాంతాల విషయంలో కూడా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని ఆమె విమర్శించారు.  కరోనా కట్టడి చేయాలంటే పరీక్షలు ఒక్కటే మార్గం అని, టెస్టులు చేయించుకోవాలనుకున్న వారందరికీ పరీక్షలు చేయాలని సూచించానని, ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల పేరు చెప్పి ప్రభుత్వం ఆ పని చేయలేదని గవర్నర్ మండిపడ్డారు. 

పేద వర్గాల కోసం జిల్లా ఆస్పత్రుల్లో కరోనా చికిత్సను ప్రారంభించాలని, మెడికల్‌ కాలేజీల్లోని ఆస్పత్రులను వినియోగించుకోవాలని, ప్రత్యేకంగా ఆస్పత్రులను ఏర్పాటు చేయాని సూచించినా ప్రభుత్వం సకాలంలో స్పందించలేదని పేర్కొన్నారు. దాంతో 33 జిల్లాల నుంచి కరోనా రోగులంతా చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె చెప్పారు. 

కరోనా పరీక్షలు చేయడానికి వీలుగా సంచార పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని పదే పదే కోరానని వెల్లడించారు. జిల్లా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు వైద్యసిబ్బందిని పెంచితే ఈ పరిస్థితి ఉండేది కాదని ఆమె స్పష్టం చేశారు.