ప్రభుత్వ ఉద్యోగాలకు ఇక కామన్ ఎంట్రన్స్ 

ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే వేర్వేరు ఉద్యోగ పరీక్షల స్థానే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీఈటీ) నిర్వహించేందుకు నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీని (ఎన్ఆర్ఏ) ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ బుధవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఎన్ఆర్ఏ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదంతో ప్రభుత్వ, పబ్లిక్ సెక్టార్ ఏజెన్సీలకు వివిధ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకునే ఇండియాలోని సుమారు 2.5 లక్షల మంది ఉద్యోగార్ధులు ఇప్పుడు ఒకే ఒక్క (సీఈటీ) పరీక్ష ఆన్‌లైన్‌లో రాస్తే సరిపోతుంది. ఇందులో వచ్చే మార్కులకు మూడేళ్ల పాటు చెల్లుబాటు (వాలిడిటీ) ఉంటుంది.
 
దేశంలోని యువతకు కేంద్ర మంత్రివర్గ నిర్ణయం వల్ల వృథా ఖర్చుల భారం తగ్గడంతో పాటు, ప్రభుత్వానికి, ఉద్యోగార్ధులకు అనవసర శ్రమ, సమయం కలిసి వస్తాయని, హడావిడి లేకుండా నిశ్చింతంగా పరీక్షలకు హాజరుకావచ్చని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వివరించారు. ఈ నిర్ణయం స్వతంత్ర భారతదేశ చరిత్రలో మైలురాయి వంటిదని అభివర్ణించారు.

కీలక మార్పులివే..

1.ప్రభుత్వ, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నాన్ గెజిటెడ్ పోస్టుల రిక్రూట్ మెంట్ కోసం వేర్వేరు పరీక్షలు అవసరం లేకుండా సింగిల్ ఆన్‌లైన్ సీఈటీకి హాజరైతే సరిపోతుంది.

2.సీఈటీలో సాధించిన మార్కులు ఫలితాలు ప్రకటించిన మూడేళ్ల వరకూ చెల్లుబాటులో ఉంటాయి.

3. తమ మార్కులు మెరుగుపరుచుకునేందుకు ప్రతి అభ్యర్థికి మరో రెండు అదనపు ఛాన్సులు ఉంటాయి. మూడింట్లో అధికంగా వచ్చిన మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు.

4.ఎన్ఆర్ఏ ఇచ్చే సీఈటీ మెరిట్ లిస్ట్‌తో కాస్ట్-షేరింగ్ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

5. ఇండియాలోని మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తరహాలోనే ఈ ఎన్ఆర్ఏ కూడా ఉంటుంది. 

కాగా, గత ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఎన్ఆర్ఏ ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదన అడ్వాన్స్ స్టేజ్‌లో ఉందని, త్వరలోనే దీనికి ఒక పూర్తిరూపం వస్తుందని గత జూన్ 25న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.