తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర పథకాలపై ఆరా 

రెండు తెలుగు రాష్ట్రాలలో తమ ప్రతిష్టాత్మక పథకాల అమలు తీరుతెన్నులపై  కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.  పిఎంఎవై(యు), అమృత్, స్వచ్ఛ భారత్ మిషన్, స్మార్ట్ సిటీస్ మిషన్, పిఎం స్వానిధి పథకాల పురోగతి ఏ విధంగా ఉందనేది ఆరా తీస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఈ రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణాల శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా రెండు రోజుల క్రితం విస్తృత సమీక్ష జరిపారు. కేంద్రం పలు పథకాలను తమ పరిధిలో ప్రతిష్టాత్మక పథకాలుగా చేపట్టింది. 

అన్ని రాష్ట్రాలలో వీటి అమలు తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు ప్రస్తుత సమీక్షా క్రమంలో భాగం అయింది. ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్బర్ నిధి, రెరా వంటి పథకాలు ఈ రెండు రాష్ట్రాలలో ఏ విధంగా అమలు అవుతున్నాయనేది కేంద్రం ఇప్పుడు తెలుసుకొంటోంది.

ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ పునరుజ్జీవ, పరివర్తన క్రమం అమృత్ కోసం అటల్ మిషన్‌లో భాగంగా 3.33 లక్షల మంచినీటి కనెక్షన్లు ఇచ్చారని వెల్లడైంది. ఇక స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా అక్కడ 1.3 లక్షల ఇళ్లకు మురుగునీటి పారుదల సౌకర్యం కల్పించారు. 

తెలంగాణకు సంబంధించినంత వరకూ అమృత్ మిషన్‌లో భాగంగా 9.01 లక్షల నల్లా కనెక్షన్లు కల్పించాల్సి ఉంది. అయితే ఇప్పటికీ ఇందులో 2.76 లక్షల ట్యాప్ కనెక్షన్లు ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు. ఎనర్జీ ఆడిట్‌కు సంబంధించి తెలంగాణను ఇఇసిఎల్‌కు అనుసంధానం చేశారు. 

వాటర్ పంపుల విద్యుత్‌వినియోగానికి సంబంధించిన ఈ ఆడిటింగ్ ప్రక్రియ పరిధిలో రాష్ట్రంలోని 11 పట్టణాలలో ఆడిట్ పూర్తయింది. 12 పట్టణాలలో 6.23 లక్షల వీధి దీపాల ఏర్పాటు చేయాలని గుర్తించారు. ఇక ఇంధన సామర్థం ఉండే ఎల్‌ఇడి లైట్లను ఇప్పటివరకూ రాష్ట్రంలో 6.65 లక్షల సాధారణ స్ట్రీట్ లైట్ల స్థానంలో అమర్చారని సమీక్షా క్రమంలో వెల్లడైంది.