నగదురహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం రూ 2,000 నోట్ల ముద్రణకు ఫుల్స్టాప్ పెట్టింది. నాలుగేళ్ల క్రితం రూ. 1,000, పాత 500 నోట్లను రద్దు చేసి దాని స్థానంలో రూ. 2,000 నోటును ప్రవేశపెట్టిన ప్రభుత్వం క్రమంగా దాని ముద్రణను తగ్గిస్తూ వస్తోంది.
ఇందులో భాగంగా 2016–17లో ఏకంగా రూ. 354.29 కోట్ల రూ. 2 వేల నోట్లను ముద్రించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ గతేడాది నుంచి ఈ నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపివేసింది. 2016 నుంచి ఇప్పటివరకు ముద్రించిన కరెన్సీ నోట్ల సంఖ్య వివరాలపై ఆర్టీఐ కార్యకర్త జలగం సుధీర్ చేసిన దరఖాస్తుకు సమాధానంగా ఆర్బీఐ ఈ మేరకు సమాధానమిచ్చింది.
నల్లధనానికి ముకుతాడు వేయాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. 2016–17తో పోలిస్తే గత ఏడాది ఏకంగా రెట్టింపు స్థాయిలో రూ. 500 నోట్లను ప్రింటింగ్ చేసింది. నాలుగేళ్ల క్రితం 429.22 కోట్ల నోట్లను ముద్రించగా గడచిన ఆర్థిక సంవత్సరం 822.77 కోట్ల నోట్లను అందుబాటులోకి తెచ్చింది.
గత నాలుగేళ్లలో 7071.63 కోట్ల కొత్త నోట్లను ఆర్బీఐ ముద్రించింది. ఇందులో రూ. 500 నోట్లు 2458 కోట్లు ఉండగా రూ. 2 వేల నోట్లు 370 కోట్లు ఉన్నాయి. గతంతో పోలిస్తే రూ. 10, రూ. 50, రూ. 100, రూ. 200 నోట్ల ప్రచురణను కూడా రిజర్వ్ బ్యాంక్ తక్కువ చేసింది. డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహాకాలు ఇస్తున్నందున చిన్ననోట్ల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలని ఆర్బీఐ భావిస్తున్నది.
ముద్రణ వ్యయం తగ్గింపులో భాగంగా ఈ నోట్ల ముద్రణను కూడా క్రమేణా తగ్గిస్తోంది. నాణేలను అందుబాటులోకి తెచ్చినందున గత నాలుగేళ్ల నుంచి రూ. 1, 2, 5 నోట్లను ముద్రణను ఆపేసింది. కరెన్సీ ముద్రణలో రూ. 200 నోటుకే ఎక్కువ ఖర్చవుతోంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఈ నోటుకే అధికంగా వ్యయం చేసినట్లు ఆర్బీఐ తెలిపింది.
రూ. 200 నోటు ముద్రణకు రూ. 2.15 చొప్పున వెచ్చించగా రూ. 500 నోటుకు రూ. 2.13, రూ. 100 నోటు ముద్రణకు రూ. 1.34 ఖర్చు చేసింది. అలాగే రూ. 50 నోటుకు 82 పైసలు ఖర్చుకాగా, రూ. 20 నోటుకు దీనికంటే మూడు పైసలు అధికంగా (85 పైసలు) ముద్రణకు వెచ్చించింది. అతితక్కువగా రూ. 10 నోటు ప్రచురణకు 75 పైసలు ఖర్చు చేసినట్లు తెలిపింది.
More Stories
త్వరలో సాటిలైట్ ఆధారిత టోల్ వసూలు
బుల్లెట్ రైలు కోసం ప్రత్యేక రకం ట్రాక్
ఏప్రిల్ 1 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీ పొడిగింపు