వాటర్ బాటిల్ ధర కంటే తక్కువకే కరోనా వ్యాక్సిన్

కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ఎంతో నైపుణ్యం సాధించామని భారత్ బయోటెక్​ సీఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు. వాటర్ బాటిల్ ధర కంటే తక్కువ ధరలోనే వ్యాక్సిన్ తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచం మొత్తానికి ఒకే నాణ్యతతో కూడిన వ్యాక్సిన్‌ను అందిస్తామని భరోసా ఇచ్చారు.  
 
వైరస్ కొత్తది కావడం వల్ల అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌పై జినోమ్‌ వ్యాలీలో జరిగిన చర్చ కార్యక్రమంలో మాట్లాడుతూ అమెరికాతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంతో సహకరిస్తున్నాయని వెల్లడించారు. 
 
తాము మార్కెట్‌లో పోటీదారులం కావొచ్చని, కానీ తమ అందరి పోరాటం కరోనాను జయించడంపైనే అని స్పష్టం చేశారు. భారత వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 70 శాతం వాటా 3 హైదరాబాద్‌ కంపెనీలదేనని చెబుతూ  ప్రపంచంలో ఏ వ్యాక్సిన్ కంపెనీ కంటే కూడా హైదరాబాద్‌ కంపెనీలు తక్కువ కాదని పేర్కొన్నారు.

వ్యాక్సిన్ల అభివృద్ధి కంపెనీలతో కేంద్రం సంప్రదింపులు జరపాలని సూచిస్తూ  వేగంగా వ్యాక్సిన్ తేవడానికి ఎవరి అవసరాలు ఏంటో తెలుసుకోవాలని చెప్పారు.

డాక్టర్‌ ఆనంద్‌ ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్‌ ఎండీ డాక్టర్‌ ఆనంద్‌ మాట్లాడుతూ వ్యాక్సిన్‌ అధిక ధరలో ఉంటే చాలా మందికి అందుబాటులో లేకుండా పోతుందని హెచ్చరించారు. ఒక్కో డోసు ధర రూ.1000 అయినా భారత్‌ లాంటి దేశాలకు అది చాలా భారమని చెప్పారు. 

 
తాము తయారు చేస్తున్న వ్యాక్సిన్‌కు కొంత సమయం పట్టొచ్చు..కానీ అందరికీ అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. దేశంలో ఏడు సంస్థలు కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో కీలకంగా ఉన్నాయి. ఈ ఏడు సంస్థలను కలిపి ఒక్కసారి కూడా సమావేశం ఏర్పాటు చేయలేదని విచారం వ్యక్తం చేశారు. డీబీటీ, సీఎస్‌ఐఆర్‌ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు.

బయోలాజికల్‌ ఈ లిమిటెడ్‌ ఎండీ మహిమా దాట్ల మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా స్పెక్‌ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకుని అనేక వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయని తెలిపారు. ఏ వ్యాక్సిన్‌ కూడా భద్రతను పణంగా పెట్టి ప్రయోగాలు చేయదని స్పష్టం చేశారు. 
 
వ్యాక్సిన్ల అన్నింటి లక్ష్యం కరోనా నుంచి రక్షణ కవచం అందించడమేనని ఆమె భరోసా ఇచ్చారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో సహజంగా కొన్ని ప్రతిజనకాలు ఏర్పడతాయి.అదే శక్తిని వ్యాక్సిన్లు ఔషధ రూపంలో అందిస్తాయని వివరించారు. 
 
వ్యాక్సిన్‌ అభివృద్ధి విధానాన్ని బట్టి వాటి సామర్థ్యాల్లో కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి అని ఆమె తెలిపారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన నెల వ్యవధిలోనే భారీ స్థాయి ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె ప్రకటించారు. నెల వ్యవధిలో 8 నుంచి 10కోట్ల డోసులు అందుబాటులోకి తీసుకు రాగలమని వెల్లడించారు.