సిఆర్‌డిఎను రద్దు.. ఎఎంఆర్‌డిఎ నోటిఫై

ఎపి సిఆర్‌డిఎను రద్దు చేస్తూ చేసిన చట్టం ఆమోదం పొందటంతో సిఆర్‌డిఎ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని నోటిఫై చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. సిఆర్‌డిఎ పరిధి అంతా ఇక నుంచి ఎఎంఆర్‌డిఎ పరిధిలోనికి వస్తుందని పేర్కొంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
 
 సిఆర్‌డిఎ రద్దు చట్టం 2020 అమల్లోకి వచ్చినందున 2014లో చేసిన సిఆర్‌డిఎ ఇక ఉనికిలో ఉండబోదని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఎఎంఆర్‌డిఎకు పురపాలక శాఖ కార్యదర్శి ఉపాధ్యక్షుడుగా 11 మంది అధికారులు సభ్యులుగా కమిటీ ఏర్పాటు అయ్యింది. 
 
కమిటీలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, ఎఎంఆర్‌డిఎ కమిషనర్‌, గుంటూరు, కష్ణాజిల్లా కలెక్టర్లు, డైరెక్టర్‌ టౌన్‌ ప్లానింగ్‌ డిప్యూటీ ట్రాన్స్‌ పోర్ట్‌ కమిషనర్‌లు సభ్యులుగా నియమితులయ్యారు. ఎఎంఆర్‌డిఎకు కమిషనర్‌గా లక్ష్మీ నరసింహంను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఎఎంఆర్‌డిఎ పరిధిని కుదించే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి సిఆర్‌డిఎ పరిధినే ఎఎంఆర్‌డిఎగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. 
ఎఎంఆర్‌డిఎను రాజధాని గ్రామాలతో పాటు సమీపంలోని ఇంకొన్ని గ్రామాలకు పరిమిం చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.