అంబాలాకు చేరుకున్న రాఫెల్ యుద్ధ విమానాలు

ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు ఇవాళ హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరంలో ల్యాండ్ అయ్యాయి. 
ఏడు వేల కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించిన రాఫెల్ విమానాలు ఇవాళ అంబాలా ఎయిర్‌బేస్‌లో సుర‌క్షితంగా ల్యాండ్ అయ్యాయి.  
 
అయిదు రాఫెళ్ల‌కు రెండు సుఖోయ్‌లు అండ‌గా నిలుస్తూ భార‌త గ‌గ‌న‌త‌లంలో ఘ‌న‌స్వాగ‌తం అందించాయి. ఆ దృశ్యం నీలాకాశంలో క‌నువిందు చేసింది.  భార‌త గ‌గ‌న‌త‌లంలోకి ప్ర‌వేశిస్తున్న రాఫెల్ యుద్ధ విమానాల ఫోటోల‌ను ర‌క్ష‌ణ‌మంత్రి కార్యాల‌యం త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది.  రాఫెల్‌ ప‌క్షులు ఇండియ‌న్ ఎయిర్‌స్పేస్‌లోకి ప్రవేశించిన్న‌ట్లు ట్వీట్‌లో తెలిపారు.  
 
మధ్యాహ్నం 3:31 సమయంలో విమానాలు ల్యాండ్ కాగానే సంప్రదాయం ప్రకారం వాటర్ సెల్యూట్ ఇచ్చారు. భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు 220 కిలోమీటర్ల దూరంలో అంబాలా వైమానిక స్థావరం ఉంది.
అంబాలా ఎయిర్‌బేస్‌లో విమానాలు ల్యాండ్ అయిన త‌ర్వాత ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.  రాఫెల్ విమానాలు ల్యాండైన క్ష‌ణం.. భార‌త సైనిక చ‌రిత్ర‌లో కొత్త శ‌కం మొద‌లైన‌ట్లు తెలిపారు. బ‌హుళ సామ‌ర్థ్యాలు క‌లిగిన రాఫెల్ యుద్ధ విమానాలు భార‌త వాయుసేన‌ను బ‌లోపేతం చేస్తాయ‌న్నారు.  రాఫెల్ విమానాలు అంబాలాలో దిగిన వీడియోను రాజ్‌నాథ్ పోస్టు చేశారు.
భారత గగనతలంలోకి బుధవారం మధ్యాహ్నం ఐదు రఫేల్‌ యుద్ధవిమానాలు చేరుకోగానే భారత నౌకా యుద్ధవిమానం నుంచి భారీ స్వాగతం లభించింది.  ‘హిందూ మహా సముద్రానికి స్వాగతం మీరు సగర్వంగా ఆకాశాన్ని తాకవచ్చు..హ్యాపీ ల్యాండింగ్స్‌’ అంటూ ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా రఫేల్‌ జెట్స్‌కు రేడియో సందేశం పంపింది. ఇందుకు రఫేల్‌ పైలట్‌ ధన్యవాదాలు తెలిపారు.
 
కాగా సోమవారం ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన రాఫెల్ విమానాలు దాదాపు ఏడు గంటల ప్రయాణం తర్వాత తొలుత యూఏఈలోని ఓ ఫ్రాన్స్ వైమానిక స్థావరంలో దిగాయి. నిన్న 30 వేల అడుగుల ఎత్తులో ఫ్రాన్స్ ట్యాంకర్ నుంచి రాఫెల్ విమానాలు గాల్లోనే ఇంధనం నింపుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.