రావి కొండలరావు కన్నుమూత

ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత, దర్శకనిర్మాత, సాహితీవేత్త, పాత్రికేయుడు రావి కొండలరావు (88) గుండె పోటుతో తుదిశ్వాస విడిచారు.  గుండెపోటుకు గురైన ఆయనను హైదరాబాద్  బేగంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా హుద్రోగ సమస్యలతో ఆయన బాధపతున్నారు.

1932, ఫిబ్రవరి 11న ఈయన శ్రీకాకుళంలో జన్మించారు. చిన్ననాటి నుంచి కూడా నాటకాలతో పాటు సినిమాలపై ఎక్కువగా ముక్కువ చూపించారు రావి కొండల రావు. ఆ ఆసక్తితోనే సినిమాల్లోకి వచ్చారు. దాదాపు 60 ఏళ్లుగా ఈయన తెలుగు పరిశ్రమలోనే ఉన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచారు.

1958లో శోభ చిత్రంలో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. తేనె మనసులు, దసరా బుల్లోడు, భైరవ ద్వీపం, రంగూన్‌ రౌడీ, చంటబ్బాయ్‌, పెళ్లి పుస్తకం, మేడమ్‌,  రాధాగోపాలం, మీ శ్రేయాభిలాషి, వరుడు, కింగ్‌, ఓయ్‌.. వంటి 600కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. తమిళ, మలయాళ సినిమాలకు డబ్బింగ్‌ కూడా చెప్పారు. మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్‌ ఎడిటర్‌గా పనిచేశారు.

సుకుమార్ అనే కలం పేరుతో వివిధ పత్రికల్లో ఎన్నో కథలు రాశారు. నాటికలు, నాటకాలు కూడా రచించారు. 2004లో ఆయన రచించిన బ్లాక్ అండ్ వైట్ అనే పుస్తకం తెలుగు సినిమాకు చెందిన ఉత్తమ పుస్తకంగా రాష్ట్ర ప్రభుత్వ తామ్ర నంది పురస్కారానికి ఎంపికైంది.

భైరవద్వీపం, బృందావనం చిత్రాలకు సంభాషణలు, పెళ్ళి పుస్తకం చిత్రానికి కథ అందించారు. తమిళ, మలయాళ చిత్రాలకు డబ్బింగ్ కూడా చెప్పారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. 

కొండలరావు భార్య, ప్రముఖ నటి రాధా కుమారి 2012లో గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. విభిన్న పాత్రల్లో కనిపించిన ఆమె దాదాపు 600లకు పైగా చిత్రాలు చేశారు. వీరిద్దరు జంటగా కూడా పలు చిత్రాల్లో నటించారు.