రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తే రాష్ట్రపతి పాలనే 

రాజ్యాంగ, న్యాయ వ్యవస్థలను తృణీకరిస్తూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన తప్పదని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని నరసాపురం ఎంపీ కె   రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు చెప్పారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముప్పు కలిగిన సందర్భంలోనే కాకుండా. రాజ్యాంగం, న్యాయ వ్యవస్థలను బేఖాతరు చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టించినప్పుడూ 356 అధికరణ అమల్లోకి వచ్చే అవకాశముందని అయన స్పష్టం చేశారు. సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఉన్న ముఖ్యమంత్రే న్యాయస్థానాల తీర్పులను ఉల్లంఘించి, అవహేళన చేస్తుంటే.. ప్రజలు కూడా వాటిని గౌరవించే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. 

ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఇలాంటి రాజ్యాంగేతర, అప్రజాస్వామిక, న్యాయవ్యతిరేక పరిస్థితులకు తావివ్వకూడదని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ వ్యవహారంలో హైకోర్టులో రాష్ట్రప్రభుత్వంపై కోర్టు ధిక్కార విచారణను నిలిపివేయాలన్న జగన్‌ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించిన నేపథ్యంలో ఆయన ఈ వాఖ్యలు చేశారు. 

‘రాజ్యాంగ వ్యవస్థలు, న్యాయవ్యవస్థలపై మా ప్రభుత్వం చేస్తున్న ఈ దాడి మంచిదికాదు. కనీసం ఇకనుంచైనా,  మనసు మార్చుకోండి. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ముఖ్యమంత్రి కూడా రాజ్యాంగంపైనే ప్రమాణం చేశారు. నేను కూడా ఎంపీగా రాజ్యాంగంపైనే ప్రమాణం చేశాను. కనుక రాజ్యాంగ విలువలకు కట్టుబడదాం’ అంటి హితవు పలికారు. 

సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లొద్దని జగన్ కు స్పష్టం చేశారు. ఇప్పటికైనా నిమ్మగడ్డను కమిషనర్‌గా కొనసాగింపునకు జగన్‌ చర్యలు తీసుకోవాలని రఘురామరాజు సూచించారు. ‘నిమ్మగడ్డ  కులం సీఎంకు ఇష్టం ఉన్నా, లేకున్నా ఆయనే కమిషనర్‌. ఇకనైనా కోర్టు తీర్పును శిరసావహించి.. ఆయన్ను కొనసాగించకపోతే.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే తొలుత ఇబ్బందుల్లో పడతారు‘ అని హెచ్చరించారు. 

నిమ్మగడ్డ కరోనా విపత్తును ముందుగానే పసిగట్టి, స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి, రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేశారని కొనియాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా తీవ్రతను చూశాక ఆయన నిర్ణయం సరైందేనని జనం మెచ్చుకుంటున్నారని చెప్పారు.