ఆసియాలోనే పెద్ద సోలార్ ప్రాజెక్టు ప్రారంభించిన ప్రధాని 

మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఏర్పాటు  చేసిన 750 మెగావాట్ల సౌరశక్తి (సోలార్ పవర్) ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఇది ఆసియాలోనే అతి పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు కావడం విశేషం. 
 
సోలార్ పార్క్‌లోని 500 హెక్టార్ల స్థలంలో ఒక్కొక్కటి 250 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న మూడు సోలార్ పవర్ యూనిట్లు ఏర్పాటు చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ ప్లాంట్లను మోదీ ప్రారంభించారు. 
 
 ఈ మెగా సోలార్ పవర్ ప్రాజెక్టు ద్వారా ఏటా 15 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్‌కు సమానమైన కాలుష్యం తగ్గపోతుందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రేవాలోని సోలార్ ప్లాంట్‌తో అక్కడి పరిశ్రమలకు విద్యుత్ అందడంతో పాటు ఢిల్లీలోని మెట్రో రైల్‌కు కూడా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. 
 
రేవాతో పాటు షాజపూర్, నీముచ్, ఛత్తర్‌పూర్‌లలోనూ సోలార్ పవర్ ప్లాంట్ల పని జరుగుతోందని వివరించారు. మధ్యప్రదేశ్ ప్రజలకు మోదీ అభినందనలు తెలుపుతూ, ఈ సోలార్ ప్లాంట్‌తో ఈ దశాబ్దంలోనే  విద్యుత్ రంగంలో అతి పెద్ద కేంద్రంగా రేవా నిలువనున్నట్టు చెప్పారు.
 
 సౌర విద్యుత్తు నేటి త‌రం కోసం మాత్ర‌మే కాదు అని, 21వ శ‌తాబ్ధ‌పు అవ‌స‌రాల‌ను ఇది తీరుస్తుంద‌ని ప్రధాని పేర్కొన్నారు.  సౌర విద్యుత్తు స్వ‌చ్ఛ‌మైంది, భ‌ద్ర‌మైందని తెలిపారు. 

రేవా ఆల్ట్రా మోగా సోలార్ లిమిటెడ్ (ఆర్‌యూఎంఎస్ఎల్), కేంద్ర పబ్లిక్ సెక్టర్ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈసీఐ) జాయంట్ వెంచర్‌గా ఈ సోలార్ పార్క్ ఏర్పాటైంది. పార్క్ అభివృద్ధి కోసం ఆర్‌యూఎంఎస్ఎల్‌కు కేంద్రం రూ.138 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తోంది.