నేపాల్‌లో భారత న్యూస్‌ చానళ్ల నిలిపివేత

చైనా చేతిలో కీలుబొమ్మగా మారిన నేపాల్ భారత్‌పై ఎప్పటికప్పుడు కాలుదువ్వుతూనే ఉంది. నేడు తాజాగా భారత టీవీ చానెళ్లనన్నింటికీ తమ దేశంలో బంద్ చేస్తున్నట్లు అక్కడి కేబుల్ ఆపరేటర్లు ప్రకటించారు. కేవలం దూరదర్శన్ మాత్రమే అనుమతిస్తున్నామని, మిగతా వాటిని స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నామని వెల్లడించారు. 

దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదని, తామే స్వచ్ఛందంగా దీనిని పాటించనున్నామని తెలిపారు. నేపాల్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రసారాలు చేస్తున్నారని ఆరోపిస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

భారత టీవీ చానెళ్లలో నేపాల్‌కు, ప్రధాని కేపీ ఓలీ శర్మకు వ్యతిరేకంగా ప్రసారమవుతున్న కార్యక్రమాలను నియంత్రించాలంటూ మాజీ డిప్యూటీ ప్రధాని, అధికార పార్టీ ప్రతినిధి నారాయణ కాజీ శ్రేష్ఠ నేడు ఉదయం ప్రకటించారు. ఆయన ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే నేపాల్ కేబుల్ ఆపరేటర్లు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.